బ్రేకింగ్: పోలీసుల అదుపులో ఇందిరా శోభన్.. పూజలు చేస్తుండగానే

by  |
బ్రేకింగ్: పోలీసుల అదుపులో ఇందిరా శోభన్.. పూజలు చేస్తుండగానే
X

దిశ, జమ్మికుంట: ఉపాధి భరోసా యాత్ర నిర్వహించేందుకు ఇల్లందకుంట చేరుకున్న ఇందిరా శోభన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు పలువురు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట నుండి ఉపాధి కల్పన కోసం నిర్వహిస్తున్న ఈ యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఇల్లందకుంట రామాలయంలో పూజలు చేస్తుండగానే వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. అయితే తమ యాత్ర గురించి రెండు రోజుల క్రితమే కరీంనగర్ సీపీని అనుమతి కోరుతు దరఖాస్తు చేసుకున్నామని ఇందిరా శోభన్ అంటున్నారు. పోలీసులు వాహనంలో ఎక్కిస్తుండగా ఏయ్ కూర్చో అంటూ పోలీసులు అమర్యాదగా మాట్లాడారంటూ ఇందిరా శోభన్ ఆరోపించారు. మహిళ పట్ల పోలీసులు మాట్లాడే పద్దతి ఇదేనా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు ఇందిరా శోభన్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇల్లందకుంటలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళనకు దిగారు.

అనుమతి లేదు: ఏసీపీ

ఇందిరా శోభన్ చేపట్టిన యాత్ర గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని హుజురాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అనుమతి కోరుతూ తమకు ఎలాంటి లేఖ రాయలేదన్నారు. ముందుగా దరఖాస్తు చేసుకుంటే నిబంధనలను అనుమతి ఇచ్చేవారమన్నారు. ఎలాంటి దరఖాస్తు చేసుకున్నా తాము బందోబస్తు కూడా ఇచ్చేవారమన్నారు. దళిత బంధు సర్వే కూడా జరుగుతున్నందున ఇలాంటి పరిస్థితుల్లో పర్మిషన్ లేకుండా పాదయాత్ర చేస్తామనడం సరికాదన్నారు. అనుమతి తీసుకోకుండానే యాత్ర చేపడ్తున్నారని తెలిసే ముందస్తుగా కస్టడీలోకి తీసుకున్నామని ఏసీపీ వెంకటరెడ్డి వివరించారు.


Next Story