దశాబ్దానికి పైగా గరిష్ఠానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!

by  |
దశాబ్దానికి పైగా గరిష్ఠానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నెలలో టోకు ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో రెండంకెలకు చేరుకుంది. ఇది ఏప్రిల్ 2010 తర్వాత దశాబ్దానికి పైగా అత్యధిక స్థాయి అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ముడి పెట్రోలియంతో పాటు తయారీ ఉత్పత్తుల ధరలు అధికంగా పెరగడంతో వరుసగా నాలుగో నెల టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) పెరిగి 10.49 శాతంగా నమోదైంది. మార్చిలో డబ్ల్యూపీఐ 7.39 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఇది 4.17 శాతం, జనవరిలో 2.51 శాతంగా నమోదైనట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు సోమవారం వెల్లడించాయి. ‘గతేడాది ఇదే నెలతో పోలిస్తే ముడి పెట్రోలియం, పెట్రో ఉత్పత్తులు, తయారీ వస్తువుల ధరలు పెరగడం వల్ల గత నెలలో రికార్డు స్థాయిలో టోకు ద్రవ్యోల్బణం 10.49 శాతంగా ఉందని’ మంత్రిత్వ శాఖ వివరించింది.

సమీక్షించిన నెలలో మాంసం, చేపలు, గుడ్ల ధరలు పెరగడంతో ఆహార పదార్థాల టోకు ద్రవ్యోల్బణం 4.92 శాతంగా నమోదయింది. విద్యుత్, ఇంధన ధరల ద్రవ్యోల్బణం 20.94 శాతంగా ఉండగా, తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 9.01 శాతంగా ఉన్నట్టు మంత్రిత్వ శాఖ వివరించింది. కూరగాయల హోల్‌సేల్ ద్రవ్యోల్బణం -9.03 శాతం, పండ్ల టోకు ద్రవ్యోల్బణం 27.43 శాతం, పప్పు ధాన్యాలు 10.74 శాతంగా నమోదయ్యాయి. బొగ్గు ధరలు 0.32 శాతం, ఖనిజాల ధరలు 0.29 శాతం పెరిగాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి వినియోగదారుల ధరల సూచీ రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 4.29 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే.

పెరుగుతున్న డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణంతో పాటు తయారీ, సేవల పీఎంఐలు ఇన్‌పుట్ ధరల ఒత్తిడిని కలిగి ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నెల ప్రారంభంలో అన్నారు. అంతేకాకుండా అన్ని రంగాల్లోనూ ఇన్‌పుట్ ధరల ఒత్తిడి, పెరుగుతున్న అంతర్జాతీయ వస్తువుల ధరలు కొంతవరకు ఈ పరిణామాలకు కారణం కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు.


Next Story

Most Viewed