ఆగస్టులో జోరు పెంచిన భారత సేవల రంగం

by  |
ఆగస్టులో జోరు పెంచిన భారత సేవల రంగం
X

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన ఏడాదిన్నర కాలంలో ఎన్నడూ లేని విధంగా భారత సేవల రంగంలోని కార్యకలాపాలు ఆగస్టులో గణనీయంగా పుంజుకున్నాయి. శుక్రవారం ఐహెచ్ఎస్ మార్కిట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశీయంగా సేవల రంగంలో కొత్త ప్రాజెక్టులు మొదలవడం, డిమాండ్ మెరుగ్గా ఉన్న కారణంగా కొనుగోలు నిర్వాహకుల సూచీ(పీఎంఐ) 56.7 పాయింట్లుగా నమోదైంది. ఇది అంతకుముందు జూలైలో 45.4గా నమోదైన సంగతి తెలిసిందే. 2020 నుంచి ఏడాదిన్నర కాలంలో సేవల రంగం వృద్ధి రేటు ఈ స్థాయిలో నమోదవడం విశేషం. సాధారణంగా పీఎంఐ సూచీ అనేది 50కి పైన నమోదైతే సానుకూల వృద్ధిని సూచిస్తుంది. 50కి దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు.

ఇటీవల కొవిడ్ టీకా ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండటం, సేవల రంగంలో కార్యకలాపాలు మునుపటి కంటే వేగంగా మొదలవడంతో పీఎంఐ సూచీ పెరిగేందుకు వీలైందని ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక అభిప్రాయపడింది. అయితే, ఇదే సమయంలో సేవల రంగంలోని ఎగుమతులు మాత్రం ఆగస్టు నెలలో క్షీణించాయి. ప్రధానంగా ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతుండటంతో పాటు అంతర్జాతీయంగా పలు దేశాల్లో కొవిడ్ ఆందోళనలను ఉండటం దీనికి కారణమని నివేదిక పేర్కొంది. సమీక్షించిన నెలలో కొత్త ఆర్డర్లు పెరిగాయి. గత మూడు నెలలుగా ప్రతికూలంగా ఉన్న తర్వాత ఈ సానుకూల పరిణామం మంచిదే. అంతేకాకుండా ఈ వృద్ధి ఎనిమిదిన్నర సంవత్సరాలలో వేగవంతమైందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్ అసోసియేట్ డైరెక్టర్ పొల్యానా డి లిమా అన్నారు. ఈ ఏడాది సానుకూల వృద్ధి కొనసాగే అవకాశాలున్నాయని, అయినప్పటికీ ఆగస్టులో ఉద్యోగాల కోతలు నమోదవడం గమనార్హమని నివేదిక తెలిపింది. ఇది జనవరితో పోలిస్తే అత్యల్పంగా ఉందని వెల్లడించింది.



Next Story