'హోటల్ పరిశ్రమ రికవరీకి మరి కొన్ని నెలలు'

by  |
హోటల్ పరిశ్రమ రికవరీకి మరి కొన్ని నెలలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిథ్య రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దశాబ్దంలోనే అత్యల్ప పనితీరును కనబరిచిందని, 2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ముగిసే సమయానికి దేశంలోనే హోటళ్లు కరోనాకు ముందునాటి స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని నియోసిస్ కేపిటల్ అడ్వైజర్స్, ఎన్‌గేజ్ హాస్పిటాలిటీ సంయుక్త నివేదిక వెల్లడించింది. 2020-21లో ‘దేశీయ హోటళ్ల పనితీరు’ పేరుతో రూపొందించిన నివేదిక ప్రకారం..హోటల్ రూమ్‌ల ధరలు 2019 స్థాయికి చేరుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది.

లాక్‌డౌన్ సమయంలో 73 శాతం వినియోగదారులు భవిష్యత్తులో సురక్షితమైన, పరిశుభ్రత కలిగిన హోటల్ గదుల కోసం 15-20 శాతం అధికంగా ధరలను వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. ఈ డిమాండ్ పరిస్థితులను వినియోగించుకునేందుకు, లాక్‌డౌన్ వంటి సవాళ్లను అధిగమించడానికి ఇండిపెండెంట్ హోటల్ యజమానులు బ్రాండెడ్ హోటళ్లతో భాగస్వామ్యం కోరుకోవచ్చని నివేదికలో తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రాండెడ్ హోటళ్ల వాటా దేశీయంగా 16 శాతం నుంచి 20 శాతానికి పెరుగుతుందని, మీడియం హోటళ్ల వాటా 22 శాతంగా ఉండొచ్చని నివేదిక పేర్కొంది. దేశీయంగా మరో రెండు మూడు త్రైమాసికాల్లో హోటల్ పరిశ్రమలో డిమాండ్ పుంజుకుంటుందని నివేదిక అభిప్రాయపడింది.



Next Story