లాక్‌డౌన్ కంటే టీకా పంపిణీయే ఉత్తమం- ఎస్‌బీఐ రీసెర్చ్

by  |
లాక్‌డౌన్ కంటే టీకా పంపిణీయే ఉత్తమం- ఎస్‌బీఐ రీసెర్చ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ విజృంభించడం, అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు, పరిశ్రమల్లో కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో పలు రేటింగ్ సంస్థలు భారత వృద్ధి రేటును తగ్గిస్తున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రీసెర్చ్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును ఇదివరకు అంచనా వేసిన 11 శాతం నుంచి 10.4 శాతానికి సవరిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులను నియంత్రించడానికి లాక్‌డౌన్‌కు బదులుగా కరోనా వైరస్ టీకా పంపిణీని పెంచడమే సరైన ప్రత్యామ్నాయమని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక అభిప్రాయపడింది.

ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో విధించిన లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థకు రూ. 1.5 లక్షల కోట్లు నష్టమని ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఈ నష్టంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల వాటానే 80 శాతం ఉంటుందని తెలిపింది. నివేదిక అంచనాల ప్రకారం ..ఇతర దేశాల అనుభవాలను పరిగణలోకి తీసుకుంటే జనాభాల్లో 15 శాతం జానాభా రెండో డోస్ టీకాను తీసుకున్న తర్వాత కరోనా తగ్గుముఖం పడుతుందని నివేదిక పేర్కొంది. ఇతర దేశాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి భారత్‌లోని మొత్తం జనాభాకు ఒకే తరహాలో టీకాను ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించగలమని ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ నివేదికలో తెలిపారు. అలాగే, ఈ ఏడాది డిసెంబర్ నాటికి భారత్‌ 15 శాతం జనాభాకు టీకాను అందించగలదని ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఇదే సమయంలో అమెరికా, జపాన్ వంటి దేశాల్లో కరోనా మూడో వేవ్ మరింత ఘోరంగా ఉందని, భారత్‌లో గనక మూడో వేవ్ ప్రవేశిస్తే భరించడం అసాధ్యమని ఎస్‌బీఐ రీసెర్చ్ హెచ్చరించింది.

Next Story