ఒత్తిడిలో ఉన్న ఫ్యాక్టరీ ఉత్పత్తి

by  |
ఒత్తిడిలో ఉన్న ఫ్యాక్టరీ ఉత్పత్తి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రాంతాల్లో విధించిన లాక్‌డౌన్ కారణంగా జాతీయ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. దీంతో అనేక పరిశ్రమలు తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయి. కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తయారీ రంగం భారీగా ప్రభావితం అయ్యిందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా రూపొందించిన మ్యాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) స్పష్టం చేసింది.

జులై నెలలో ఫ్యాక్టరీ పీఎంఐ జూన్‌లో నమోదైన 47.2 నుంచి 46కి పడిపోయింది. సాధారణంగా పీఎంఐ 50 పైన ఉంటే ఫ్యాక్టరీ ఉత్పత్తి పెరిగినట్టుగా లేదా సానుకూలంగా ఉన్నట్టు భావిస్తారు. దీనికి దిగువన నమోదైతే ప్రతికూలంగా ఉన్నట్టుగా గుర్తిస్తారు. ఐహెచ్ఎస్ మార్కెట్‌లోని ఆర్థిక వేత్త ఎలియట్ కెర్ మాట్లాడుతూ.. జూన్ నెల పతనంతో పోలిస్తే జులైలో కొంత పుంజుకున్నప్పటికీ.. వరుసగా ఒత్తిడి ఎదుర్కొన్నట్టేనని అన్నారు.

ఏప్రిల్‌లో పీఎంఐ 27.4కి పడిపోయినప్పుడు భారతదేశ ఫ్యాక్టరీ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తరువాత మేలో 30.8కి చేరుకుంది. జూన్‌ నాటికి దాదాపు 50 పాయింట్ల మార్కు దగ్గరకు చేరుకుంది. ఇది సంకోచం నుంచి సానుకూలతకు పయనించే విధానాన్ని సూచిస్తుందని ఎలియట్ కెర్ తెలిపారు. కరోనా విపరీతంగా ఉన్న క్రమంలో పరిశ్రమలు మునుపటి స్థితిని చేరుకునేందుకు కష్టపడుతున్నాయి. వారి క్లయింట్లు లాక్‌డౌన్ ప్రభావంలో ఉన్నారు క్రమంగా ఆంక్షలు పూర్తిగా తొలగే వరకు కార్యకలాపాలు సాధారణ స్థాయికి రాలేవని ఎలియట్ కెర్ అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed