2019-20 ముగిసే నాటికి రూ. 21లక్షల కోట్లకు దేశీయ ఎగుమతులు

by  |
2019-20 ముగిసే నాటికి రూ. 21లక్షల కోట్లకు దేశీయ ఎగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశ ఎగుమతులు సుమారు రూ. 21.4 లక్షల కోట్లకు చేరుకుంటాయని, ఈ ఏడాది కరోనా ప్రభావం కారణంగా సరుకుల ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్స్(ఎఫ్ఐఈఓ) బుధవారం తెలిపింది. అయితే, 2021లో దేశీయ పరిస్థితుల్లో అనేక మార్పుల వల్ల ఎగుమతుల విభాగం మెరుగైన వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని ఎఫ్ఐఈఓ అధ్యక్షుడు శరద్ కుమార్ చెప్పారు. ‘ ప్రపంచ వాణిజ్యంలో వీ-షేప్ రికవరీ కనిపిస్తోంది.

మొదటి, రెండు త్రైమాసికంలో దారుణ పరిస్థితులు ఉన్నందున ఈ ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ రూ. 21.4 లక్షల కోట్లకు పరిమితం అవుతుందని’ ఆయన పేర్కొన్నారు. ప్రాసెస్ ఫుడ్, ఫార్మా, మెడికల్, డయాగ్నస్టిక్ ఉత్పత్తుల్, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, నెట్‌వర్ ఉత్పత్తులు సహా విభాగాల్లో ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో 2021-22లో ఎగుమతుల విలువ సుమారు రూ. 26 లక్షల కోట్లకు పెరుగుతుందని శరద్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా దిగుమతులు ఎక్కువగా జరుగుతున్న రంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ప్రధాన సాంప్రదాయ రంగాలను ప్రోత్సహించాలని తద్వారా ఎగుమతులతో పాటు ఉపాధికి మేలు ఉంటుందని ఎఫ్ఐఈఓ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 17.8 శాతం తగ్గి రూ. 12.8 లక్షల కోట్లకు చేరుకున్నాయి.



Next Story