ఏప్రిల్‌లో మూడు రెట్లు పెరిగిన భారత ఎగుమతులు!

by  |
exports
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారత ఎగుమతులు గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దీంతో పాటు దిగుమతులు సైతం గణనీయంగా పెరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. 2020 ఏప్రిల్‌లో రూ. 75.8 వేల కోట్ల(10.36 బిలియన్ డాలర్లు) విలువ ఎగుమతులు నమోదవగా ఈ ఏడాది ఏకంగా 195.7 శాతం పెరిగి రూ. 2.24 లక్షల కోట్లు(30.63 బిలియన్ డాలర్లు)కు చేరుకున్నాయని శుక్రవారం ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి.

సమీక్షించిన నెలలో దిగుమతులు కూడా 167 శాతం పెరిగి రూ. 3.34 లక్షల కోట్ల(45.72 బిలియన్ డాలర్లు)కు పెరిగాయి. గతేడాది ఇదే నెలలో దిగుమతులు రూ. 1.25 లక్షల కోట్లు(17.12 బిలియన్ డాలర్లు)గా నమోదయ్యాయి. వాణిజ్య లోటు గతేడాది రూ. 49.5 వేల కోట్లు(6.76 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే రూ. 1.10 లక్షల కోట్ల(15.10 బిలియన్ డాలర్లు)కు పెరిగింది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఎగుమతులు రికార్డు స్థాయిలో 60.28 శాతం దిగజారాయి. చమురు దిగుమతుల విలువ రూ. 79 వేల కోట్లు ఉండగా, గతేడాది ఇదే నెలలో రూ. 33.6 వేల కోట్లుగా నమోదైనట్టు గణాంకాలు పేర్కొన్నాయి. ఏప్రిల్‌లో ప్రధానంగా రత్నాలు, ఆభరణాలు, జూట్, కార్పెట్, హ్యాండీక్రాఫ్ట్స్, లెదర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు వంటి ఎగుమతులు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.


Next Story