భారత్ నుంచి చైనాకు రెండింతలు పెరిగిన ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు!

by  |
Indian engineering exports
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ నుంచి చైనాకు ఎగుమతి చేసే ఇంజనీరింగ్ వస్తువుల రవాణా ఈ ఏడాది నవంబర్‌లో రెండింతలు పెరిగి సుమారు రూ. 3,260 కోట్లకు పెరిగిందని ఇంజినీరింగ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఈఈపీసీ) వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో ఈ ఎగుమతుల విలువ మొత్తం రూ. 1,540 కోట్లుగా నమోదైందని పరిశ్రమల సంఘం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో అమెరికాకు భారత్ ఎగుమతి చేసే ఇంజనీరింగ్ వస్తువులు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో 36.6 శాతం పెరిగాయి.

అలాగే సమీక్షించిన నెలలో యూఏఈకి భారత్ దాదాపు రూ. 3 వేల కోట్లకు పైన ఎగుమతులను నమోదు చేసింది. అయితే, మొత్తం ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు అక్టోబర్‌లో నమోదైన రూ. 67 వేల కోట్ల కంటే నవంబర్‌లో కొంత తగ్గాయని ఈఈపీసీ పేర్కొంది. ఇదే సమయంలో గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఎగుమతులు 37.12 శాతంతో గణనీయంగా పెరిగాయి. ‘అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అస్థిరత, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ఎగుమతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని’ ఈఈపీసీ ఇండియా చైర్మన్ మహేష్ దేశాయ్ అన్నారు.



Next Story

Most Viewed