ఇండియాకు అమెరికా సాయుధ డ్రోన్‌లు!

by  |
ఇండియాకు అమెరికా సాయుధ డ్రోన్‌లు!
X

న్యూఢిల్లీ : చైనా, పాకిస్తాన్‌లకు సరిహద్దుల్లో చెక్ పెట్టడానికి భారత్ రక్షణవ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటున్నది. ముఖ్యంగా సముద్రజలాల్లో చైనా దుందుడుకుతనాన్ని నియంత్రించడానికి సంసిద్ధమైంది. ఇందులో భాగంగానే అమెరికా నుంచి 30 ఆర్మ్‌డ్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి సిద్ధమైనట్టు తెలిసింది. మూడు బిలియన్ డాలర్ల రక్షణ సంబంధ కొనుగోలు కింద 30 ఎంక్యూ9బీ ప్రిడేటర్ డ్రోన్‌లను విక్రయించాలని భారత్ భావిస్తున్నట్టు ఓ అమెరికా అధికారి వెల్లడించారు. వీటిని సాన్‌డీగోకు చెందిన జనరల్ అటామిక్స్ తయారుచేస్తున్నదని వివరించారు. ఈ డీల్ భారత రక్షణ వ్యవస్థను సుసంపన్నం చేయనున్నది. ఇప్పటి వరకు భారత అమ్ముల పొదిలో నిఘా లేదా పర్యవేక్షణలకే పరిమితమైన డ్రోన్‌లున్నాయి. కానీ, ఆయుధాలను మోసుకెళ్లే డ్రోన్లు లేవు. ఈ డీల్‌తో ఇండియన్ డిఫెన్స్‌లోకి ప్లేలోడ్‌లను మోసుకెళ్లే డ్రోన్‌లు వచ్చి చేరనున్నాయి.

ఎంక్యూ-9బీ డ్రోన్‌లు 48 గంటలపాటు గాల్లో ఎగరగలవు. 6వేల నాటికల్ మైళ్లు ప్రయాణించగలవు. సుమారు 1700 కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యగలవి. ఈ డ్రోన్‌లు సముద్ర జలాలను పర్యవేక్షించి రక్షించడానికి ఉపయుక్తమవుతాయి. దక్షిణ హిందూ మహాసముద్రంలో చైనా యుద్ధ నౌకలపై ఓ కన్నేసి ఉంచడానికి ఈ డ్రోన్‌లు సరిగ్గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.



Next Story

Most Viewed