మొబైల్ ఉత్పత్తి కేంద్రంగా భారత్

by  |
మొబైల్ ఉత్పత్తి కేంద్రంగా భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న రోజుల్లో భారత్ మొబైల్ ఉత్పత్తి కేంద్రంగా మారే అవకాశాలున్నాయని పరిశోధనా సంస్థ టెక్ఆర్క్ వ్యవస్థాపకుడు ఫైజల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఏడాది ముగిసేలోగా భారత్ రూ. 11,113 కోట్లకు పైగా విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేస్తుందని టెక్ఆర్క్ తన నివేదికలో వెల్లడించింది. 2020లో మొత్త స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల విలువ రూ. 11 వేల కోట్లను దాటిందని, దేశం నుంచి ఎగుమతి చేసిన మొత్తం మొబైల్‌ఫోన్‌లలో 98 శాతం స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. యూఏఈ, పొరుగున ఉన్న సార్క్ దేశాలకు భారత్ కొంతకాలంగా మొబైల్‌ఫోన్‌లను ఎగుమతి చేస్తోంది. ఇటీవల మేక్ ఇన్ ఇండియా నినాదంతో భారత్ మొబైల్‌ఫోన్ ప్రపంచ ఎగుమతిదారుగా మారింది’ అని టెక్ఆర్క్ వ్యవస్థాపకుడు, చీఫ్ అనలిస్ట్ ఫైజల్ కవుసా చెప్పారు.

భారత్ ప్రస్తుతం 24 దేశాలకు ఎగుమతి చేస్తోంది. యూఏఈ లాంటి దేశాలు వాటిని తిరిగి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అలా భారత్‌లో తయారుచేసిన ఫోన్‌లు లక్షల్లో వినియోగదారులకు చేరుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ పథకం ద్వారా ప్రపంచ మొబైల్ మార్కెట్లో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని, భారత్ మొబైల్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలనే తయారీదారుల లక్ష్యానికి ఈ పథకం దోహదపడుతుందని ఫైజల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య భారత్ మొత్తం 1.28 కోట్ల మొబైల్‌ఫోన్‌లను ఎగుమతి చేసిందని, వీటిలో 1.09 కోట్లు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయని టెక్ఆర్క్ నివేదిక వెల్లడించింది.


Next Story

Most Viewed