యూకే చట్టసభ్యులను ఖండించిన భారత్

by  |
యూకే చట్టసభ్యులను ఖండించిన భారత్
X

న్యూఢిల్లీ: కొందరు బ్రిటీష్ చట్టసభ్యులు ఇక్కడ జరుగుతున్న రైతుల పోరాటం, పత్రికా స్వేచ్ఛపై జరిపిన చర్చను భారత్ ఖండించింది. బ్రిటన్ ఎంపీలు తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉన్నారని, ఏకపక్షంలో చర్చ చేశారని లండన్‌లోని భారత హైకమిషన్ మండిపడింది. వాస్తవాధారాలు లేకుండానే చర్చించడం విస్మయానికి గురిచేసిందని, చర్చను బ్యాలెన్స్‌డ్‌గా నిర్వహించకుండా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌పై అవాంఛిత ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించింది. బ్రిటీష్ సహా ఫారీన్ మీడియా భారత్‌లో జరుగుతున్న రైతు ఆందోళనలపై కవర్ చేశాయని, అలాంటప్పుడు భారత్‌లో మీడియాకు స్వేచ్ఛ లేదని వాదించడం అసంబద్ధమని ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్ ఎప్పటికప్పుడు సవివరాలు అందిస్తున్నప్పటికీ ఈ చర్చలో తప్పుడు అభిప్రాయాలు వినిపించాయని తెలిపింది. సాధారణంగా బ్రిటన్ చట్టసభ్యులు అంతర్గతంగా నిర్వహించే చర్చలపై స్పందించబోదని వివరించింది. కానీ, భారత్‌పై ఎవరు అనవసర ఆరోపణలు చేసినా, ఏ అవసరం, ఉద్దేశాలతో చేసినా వారి అభిప్రాయాలను సరిచేయాల్సిన బాధ్యతగా తాము భావిస్తామని పేర్కొంది.

భారత్‌లో 100 రోజులకు పైగా జరుగుతున్న రైతుల ఆందోళనకు కారణమైన మూడు సాగు చట్టాల గురించి, ఆ ఆందోళనలను కవర్ చేసిన మీడియా ప్రతినిధులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నదని పేర్కొంటూ ఓ ఈపిటిషన్ క్యాంపెయిన్ జరిగింది. దీనిపై ఒక లక్షల మందికిపైగా సంతకాలు లభించడంతో బ్రిటన్ ఎంపీలు సోమవారం పార్లమెంటు ఆవరణలో చర్చించారు. సుమారు పది బ్రిటన్ పార్టీల ఎంపీలు భారత్‌లో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడారు. ఈ చర్చలపై బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి ఫారీన్ కామన్‌వెల్త్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మినిస్టర్ స్పందిస్తూ ‘యూకే, భారత్ అనేక సమస్యలను పరిష్కరించాయి. ఇండియాతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే దిశగా బ్రిటన్ ఆలోచిస్తున్నది. వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, పర్యావరణం, రక్షణ, భద్రత, తదితర అంశాలపై కలిసి పరస్పర ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ, భారత్‌తో కష్టమైన సమస్యలు లేవనెత్తడానికి యూకే వెనుకాడే పరిస్థితులు లేవు’ అని తెలిపారు. రైతుల ఆందోళన భారత్ అంతర్గత వ్యవహారమని పేర్కొంటూనే పై విధంగా వ్యాఖ్యానించారు.

Next Story