భారీగా పుంజుకున్న భారత్ జీడీపీ..

by  |
gdp
X

దిశ, వెబ్‌డెస్క్: భారత జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బలంగా పుంజుకుంది. ప్రభుత్వ గణాంక కార్యాలయం మంగళవారం విడుదల చేసిన డేటా ప్రకారం 2021-22 ఏప్రిల్-జూన్ మధ్య ఈ వృద్ధి 20.1 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి 24.4 శాతం కుదేలైన సంగతి తెలిసిందే. వృద్ధి రేటు తొలి త్రైమాసికంలో బలంగా ఉన్నంత మాత్రాన మెరుగైన రికవరీగా భావించలేమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమీక్షించిన త్రైమాసికంలో నమోదైన భారీ వృద్ధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా భారత్ నిలిచింది. వాస్తవ జీడీపీ( 2011-12 నాటి) రూ. 32.39 లక్షల కోట్లుగా ఉంది.

అయితే, 2019-20 మొదటి త్రైమాసికంలో నమోదైన రూ. 35.66 లక్షల కంటే ఇది తక్కువగా ఉంది. దీన్ని బట్టి భారత్ కొవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి ఇంకా బయటపడలేదని తెలుస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశ స్థూల విలువ జోడింపు(జీవీఏ) వృద్ధి తయారీ రంగం 49.6 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో ఇది 36 శాతం పడిపోయింది. వ్యవసాయ రంగ జీవీఏ వృద్ధి 4.5 శాతం, నిర్మాణ రంగం 68.3 శాతం, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ 3.7 శాతం, రక్షణ, ప్రజా పరిపాలన, ఇతర సేవల రంగాల జీవీఏ 5.8 శాతంగా వృద్ధి నమోదు చేశాయి.


Next Story