పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకున్న హెచ్‌డీఎఫ్‌సీ

by  |
Postal-Bank-21
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)తో హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ కీలక భాగస్వామ్యం చేసుకుంది. ఐపీపీబీకి చెందిన దాదాపు 4.7 కోట్ల మంది వినియోగదారులకు గృహ రుణాలను అందించేందుకు ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఐపీపీబీకి ఉన్న 650 బ్రాంచులు, 1,36,000 బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్ల(పోస్టాఫీస్) నెట్‌వర్క్ సామర్థ్యంతో హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించామని హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. దీనికి సంబంధించి వ్యూహాత్మక అవగాహన ఒప్పందం కుదిరిందని ఇరు సంస్థలు ప్రకటించాయి.

‘ఈ భాగస్వామ్యంతో ఖాతాదారులకు హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాలను సులభంగా అందించే వీలుంటుంది. ముఖ్యంగా బ్యాంకులు అందుబాటులో లేని, తక్కువ సేవలందించే ప్రాంతాల్లో వినియోగదారులకు ప్రయోజనాలు లభిస్తాయి. ఫైనాన్స్ అందుబాటులో లేని వారు సొంత ఇంటిని నిర్మించుకోవాలనుకునే కలను నిజం చేసేందుకు ఐపీపీబీ ఈ గృహ రుణాలను అందజేస్తుందని’ హెచ్‌డీఎఫ్‌సీ వివరించింది. ‘ గృహ రుణాలను కస్టమర్లకు చేర్చడంలో సంస్థకు ఉన్న సామర్థ్యం కీలకపాత్ర పోషించనుందని, ఖాతాదారులకు సమీపంలో క్రెడిట్ సౌకర్యాలు లేని లోటు తీర్చేందుకే ఈ భాగస్వామ్యం’ అని ఐపీపీబీ ఎండీ జె వెంకట్రాము అన్నారు.



Next Story