లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం కాదు : టాటా సన్స్ ఛైర్మన్!

by  |
లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం కాదు : టాటా సన్స్ ఛైర్మన్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ వీలైనన్ని ఎక్కువ కరోనా టీకా లైసెన్సులను పొందాలని, వినాశకరంగా మారుతున్న సెకెండ్ వేవ్ నేపథ్యంలో టీకా ఉత్పత్తిని పెంచేందుకు యుద్ధ ప్రాతిపదికన తయారీ సంస్థలను సిద్ధం చేయాలని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. కొవిడ్ సెకెండ్ వేవ్ ఆందోళన కలిగించే, భయపెట్టే స్థాయిలో ఉందన్నారు. కరోనా కేసులను గుర్తించడం, టీకాలను అందించడం, టీకా సరఫరాను పర్యవేక్షించడం తప్పనిసరి అన్నారు.

అదే సమయంలో, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించడం పరిష్కారం కాదని, దీనివల్ల ఆర్థికవ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని చంద్రశేఖరన్ తెలిపారు. లాక్‌డౌన్ వల్ల సమాజంలోని ఆదాయంపై ఆధారపడ్డ ప్రజలు ఎక్కువ ప్రభావితమవుతారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు సరైనవని భావిస్తున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన.. ఈ పరిస్థితులను అధిగమించేందుకు టీకా ఉత్పత్తిని యుద్ధప్రాతిపదికన నిర్వహించాల్సి ఉంటుంది. అవసరమైన పెట్టుబడులను తక్కువ వ్యవధిలో అందించాలి. దీనివల్ల ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో టీకా ఉత్పత్తిని చేపట్టడంపై స్పష్టత కలిగి ఉండటం వల్ల మన అవసరాలను తీర్చుకోగలమన్నారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూనే ఆర్థికవ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుందని చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు.

Next Story

Most Viewed