భారీ డిమాండ్.. పెరిగిన బంగారం దిగుమతులు

by  |
భారీ డిమాండ్.. పెరిగిన బంగారం దిగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ ఈ ఏడాది మార్చిలో భారీస్థాయిలో 161 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్టు జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి(జీజేఈపీసీ) తెలిపింది. ఇది గతేడాది మార్చితో పోలిస్తే 470 శాతం వృద్ధిని పేర్కొంది. 2020 ఇదే నెలలో బంగారం దిగుమతులు 28.09 టన్నులుగా నమోదయ్యాయి. బంగారం దిగుమతుల సుంకం 5 శాతం, ధరల తగ్గుదల, అంతర్జాతీయ ఎగుమతుల మార్కెట్లో డిమాండ్ పెరగడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్, వ్యాపార, వినియోగ సెంటిమెంట్ వంటి కీలక అంశాలు మార్చి నెల భారీ పసిడి దిగుమతులకు కారణమని జీజేఈపీసీ వివరించింది.

వీటికితోడు జీజే ఈపీసీ నిర్వహించిన వివిధ వర్చువల్ కార్యక్రమాల్లో ఆభరణాల ప్రదర్శనలు, కొనుగోలు అమ్మకందారుల సమావేశాలతో.. దేశీయ తయారీదారులకు కొత్త ఆభరణాల కోసం భారీగా ఆర్డర్లు వచ్చాయని తెలుస్తోంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 22.58 శాతం పెరిగాయి. విలువ పరంగా ఇది సుమారు రూ. 2.50 లక్షల కోట్లకు పైమాటే. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 2 లక్షల కోట్ల వరకూ ఉంది. రాబోయే రోజుల్లో పెళ్లిళ్ల సీజన్, అక్షయ తృతీయ ద్వారా బంగారానికి డిమాండ్ భారీగా పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు సైతం వెల్లడించాయి.



Next Story

Most Viewed