సాధారణ స్థాయికి చేరిన ఇంధన అమ్మకాలు

by  |
సాధారణ స్థాయికి చేరిన ఇంధన అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఇంధన డిమాండ్(ఏటీఎఫ్ మినహా) కరోనా పూర్వస్థాయికి తిరిగి వచ్చిందని, ఆర్థికవ్యవస్థ రికవరీ సమీప భవిష్యత్తులో వినియోగాన్ని పెంచేందుకు సహాయపడుతుందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(ఐఓసీ) చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ చెప్పారు. గతేడాది కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో 2020 ఏప్రిల్‌లో ఇంధన అమ్మకాలు రికార్డు స్థాయిలో 45.8 శాతం క్షీణించాయి. లాక్‌డౌన్ సడలింపు తర్వాత డిమాండ్ తిరిగి పుంజుకుంది. మొదట పెట్రోల్ సాధారణ స్థాయికి చేరుకుంది, ఇప్పుడు డీజిల్ కూడా కరోనా పూర్వస్థాయికి తిరిగి వచ్చిందని ఆయన అన్నారు. ‘ఏటీఎఫ్ ఇంధనం మినహా అన్ని రకాల ఇంధనాలు సాధారణ డిమాండ్ స్థాయిని తాకాయని శ్రీకాంత్ తెలిపారు.

కొన్ని నెలల క్రితం పెట్రోల్ కరోనా ముందు స్థాయికి చేరుకోగా, మార్చి మొదటి వారంలో డీజిల్ 7.4 శాతం పెరిగింది. లాక్‌డౌన్ సమయంలోనే ఎల్‌పీజీ అమ్మకాలు వృద్ధిని సాధించాయి. విమాన ఇంధనం మాత్రమే సాధారణం కంటే తక్కువగా ఉన్నాయని ఆయన వివరించారు. ఇది సాధారణ స్థితికి వచ్చేందుకు మరో త్రైమాసికం పట్టొచ్చు. బహుశా 3-4 నెలలైనా కావచ్చని అభిప్రాయపడ్డారు. మార్చి మొదటి 15 రోజుల్లో డీజిల్ అమ్మకాలు 28.4 లక్షల టన్నులకు, పెట్రోల్ డిమాండ్ 5.3 శాతం పెరిగి 10.5 లక్షల టన్నులకు చేరుకుంది. గతేడాది అక్టోబర్ తర్వాత పెట్రోల్ అమ్మకాలు ఈ స్థాయి పెరగడం ఇదే మొదటిసారి. లాక్‌డౌన్ తర్వాత 80 శాతానికిపైగా పడిపోయిన ఏటీఎఫ్ అమ్మకాలు మార్చి అర్ధ భాగంలో 36.5 శాతం తగ్గాయి.

Next Story

Most Viewed