కరోనా దెబ్బకు కన్నీరు పెడుతున్న రంగాలు!

by  |
కరోనా దెబ్బకు కన్నీరు పెడుతున్న రంగాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం ఇప్పుడు అత్యంత క్లిష్టమైన సందర్భాన్ని ఎదుర్కుంటోంది. అనేక రంగాలు, పరిశ్రమలు కలిగిన దేశం ఇండియా. ఇటీవల థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) ఇచ్చిన నివేదిక ప్రకారం అత్యంత విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ప్రభావం దేశానికి పెనుముప్పుగా మారనుందని హెచ్చరించింది. కరోనా వైరస్ ఫలితాలతో దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుంది. కరోనాను అరికట్టేందుకు చైనా ముందు లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో అన్ని దేశాలకు సరఫరా లోటు ఏర్పడింది. ప్రస్తుతం ఇండియా లాక్‌డౌన్ స్టేజ్‌కి రావడం డిమాండ్ కొరతను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనివల్ల ఇదివరకే ఉన్న మాంద్యాన్ని మరింత పెద్దదిగా, ఎక్కువ కాలం కొనసాగేలా చేస్తుంది.

సీఎంఐఈ నివేదిక ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య సంకోచం 12.9 శాతం. ఇది 2008లో ఏర్పడ్డ ప్రపంచ ద్రవ్య సంకోచం కంటే ఆరు శాతం ఘోరమైంది. ముఖ్యంగా మైనింగ్, నిర్మాణం, విద్యుత్ వంటి ప్రధాన రంగాల స్థూల విలువలో సంకోచాన్ని సూచిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. కరోనా ప్రభావం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో ఉత్పాదక రంగం 10.5 శాతం, మైనింగ్ 25 శాతం, విద్యుత్ 4.5 శాతం, ఆర్థికేతర సేవలు 6 శాతం, నిర్మాణ రంగ 8 శాతం క్షీణిస్తాయని సర్వే అభిప్రాయపడింది. గడిచిన రెండు దశాబ్దాలలో ఇలాంటి సంక్షోభం 2010 జూన్ త్రైమాసికంలో నమోదైంది.

గత 20 ఏళ్లుగా ఉన్న ధోరణిని పోల్చి చూస్తే చాలా పేలవమైన పనితీరు ఇదేనని నివేదికలో ఉంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంకా అనేక రంగాలకు హానీ తప్పేలా లేదని సర్వే చెబుతోంది. ప్రస్తుత త్రైమాసికంలో హోటల్‌లు, పర్యాటక, రిటైల్ వాణిజ్యం కూడా సానుకూల వృద్ధిని సాధించినప్పటికీ, రానున్న త్రైమాసికంలో ఈ రంగాలు తిరోగమనాన్ని చూడాల్సి వస్తుంది. ఇది దేశ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని, దేశంలో జీవన స్థితిగతులని మార్చేయగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags : CMIE, Centre For Monitoring Indian Economy, Coronavirus Outbreak, FOurth Quarter Earning, Manufacturing, Mining, Electricity, Construction



Next Story

Most Viewed