11 ఏండ్ల తర్వాత ఈ రోజే విరాట్ వెనుదిరిగాడు

by  |
11 ఏండ్ల తర్వాత ఈ రోజే విరాట్ వెనుదిరిగాడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది వన్డే సీజన్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయకుండానే ముగించాడు. 2009 తర్వాత ఒక సీజన్‌లో విరాట్ సెంచరీ చేయకపోవడం ఇదే తొలిసారి. బుధవారం ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా ఆడిన మూడో వన్డే 2020 సీజన్‌లో చివరిది. ఈ మ్యాచ్‌లో 63 పరుగులు చేసిన కోహ్లీ హెజెల్‌వుడ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

2020 వన్డే సీజన్‌పై కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపింది. మహమ్మారి కారణంగా దక్షిణాఫ్రికా టూర్ అర్ధంతరంగా రద్దయింది. ఈ సీజన్‌లో 9 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 47.88 సగటుతో 431 పరుగులు చేశాడు. మొత్తం ఐదు అర్ధ సెంచరీలు బాదిన టీమ్ ఇండియా కెప్టెన్ సెంచరీ మాత్రం చేయలేకపోయాడు.

టీమ్ ఇండియా తరఫున అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్నది. ఆ తర్వాత స్థానం కోహ్లీదే. 251 వన్డే మ్యాచ్‌లు ఆడిన విరాట్ 59.31 సగటుతో 12,040 పరుగులు చేశాడు. ఇందులో 43 సెంచరీలు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ పేరిట 49 సెంచరీల రికార్డు ఉన్నది.

2008లో విరాట్ కోహ్లీ తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ ఏడాది అర్ధ సెంచరీ చేసిన విరాట్ సెంచరీ బాదలేకపోయాడు. కానీ, టీమ్ ఇండియా‌కు టాప్‌ ఆర్డర్‌లో కావాల్సినన్ని పరుగులు అందించాడు.

ప్రస్తుత సీజన్‌కు ముందు మూడు సీజన్లలో కోహ్లీ అద్భుతంగా రాణించాడు. 2017లో ఆరు, 2018 ఆరు, 2019లో 5 చొప్పున సెంచరీలను బాదాడు. గత మూడు సీజన్‌లోనూ 1000కిపైగా పరుగులు చేయడం గమనార్హం. 12 ఏండ్ల కెరీర్‌లో ఏడు సీజన్లలో 1000కిపైగా పరుగులు చేశాడు.

బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరో రికార్డును కూడా నెలకొల్పాడు. అతి వేగంగా 12,000 పరుగుల మైలు రాయిని దాటిని క్రికెటర్‌గా నిలిచాడు. మొత్తం 241 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ఈ ఫీట్‌ను సాధించాడు. సచిన్ టెండూల్కర్‌కు 12,000 పరుగులు చేయడానికి 300 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి.

ఇక విరాట్ కోహ్లీ పేరిట వేగంగా 10,000, 11,000 పరుగుల రికార్డు కూడా ఉండటం గమనార్హం.


Next Story

Most Viewed