ఆదుకున్న వరుణుడు.. కష్టాల్లో భారత మహిళా జట్టు

by  |
IND-vs-ENG
X

దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుణుడు అడ్డంకిగా మారగానే ఫ్యాన్స్ అందరూ తిట్టుకున్నారు. కానీ అదే వరుణుడు ఇంగ్లాండ్, ఇండియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మూడో రోజు ఆటకు అడ్డుపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రెండో రోజు ఇంగ్లాండ్ జట్టు 396/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియకు ఓపెనర్లు స్మృతి మంధాన (78), షెఫాలీ వర్మ (96) శుభారంభాన్ని అందించారు. అయితే చివరి సెషన్‌లో ఇంగ్లాంగ్ బౌలర్ల ధాటికి 20 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. ఇక మూడో రోజు 187/5 ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఒక్క పరుగు కూడా జత చేయకుండానే రెండు కీలక వికెట్లు పోగొట్టుకున్నది. ఇంగ్లాండ్ బౌలర్ సోఫి ఎక్లిస్టోన్ భారత జట్టును కుప్ప కూల్చింది.

ఆమె బౌలింగ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్(4) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. మరి కొద్ది సేపటికే తానియా భాటియా(0) సోఫీ ఎక్లిస్టోన్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యింది. స్నేహ్ రాణా(2) కూడా సోఫీ ఎక్లిస్టోన్ బౌలింగ్‌లో జోన్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరింది. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ కాసేపు పోరాడారు. వీరిద్దరూ కలసి తొమ్మిదో వికెట్‌కు 33 పరుగులు జోడించారు. వీరిద్దరి జోడీని బ్రంట్ విడదీసింది. స్నేహ్ వస్త్రాకర్ (12) బ్రంట్ బౌలింగ్‌లో అవుటయ్యింది. ఇక జులన్ గోస్వామి (1) షర్బ్‌సోల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యింది. దీంతో భారత జట్టు 81.2 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీప్తి శర్మ (29) నాటౌట్‌గా నిలిచింది. సోఫీ ఎక్లిస్టోన్ 4, హీథర్ నైట్ 2 వికెట్లు తీయగా కేథరిన్ బ్రంట్, అన్యా షర్బ్‌సోల్, నాట్ షివర్, కేట్ క్రాస్ తలా ఒక వికెట్ తీశారు.

ఫాలో ఆన్..

భారత జట్టు 231 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లాండ్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో ఇండియాను ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 29 పరగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ స్మృతి మంధాన (8) బ్రంట్ బౌలింగ్‌లో షివర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరింది. టీమ్ ఇండియా బ్యాటర్లు మరోసారి క్యూ కడతారని అందరూ భావించారు. అయితే తొలి టెస్టు ఆడుతున్న షెఫాలీ వర్మ మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడింది. వికెట్ పడినా తన సహజశైలిని కొనసాగించింది. దూకుడైన బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకపడింది. ఈ క్రమంలో 57/1 స్కోర్ వద్ద వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. కొద్ది సేపటి తర్వాత తిరిగి ఆటను ప్రారంభించారు. షెఫాలీ తన ధాటిని కొనసాగించింది. కేవలం 68 బంతుల్లో 55 పరుగులు చేసింది. ఇందులో 11 బౌండరీలు ఉండటం విశేషం. భారత జట్టు స్కోర్ 83/1 వద్ద వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో అంపైర్లు టీ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎంతకూ వర్షం ఆగకపోవడంతో మూడో సెషన్ పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించారు. భారత జట్టు ఈ రోజు మొత్తం సెషన్లు ఆడి ఉంటే ఎలా ఉండేదో కానీ వరుణుడు వచ్చి ఆదుకున్నాడని అభిమానులు సంతోషించారు. భారత జట్టు ఇంకా 82 పరుగులు వెనుకబడి ఉన్నది. షెఫాలీ వర్మ 55, దీప్తి శర్మ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. చివరిదైన నాలుగో రోజు భారత జట్టు పూర్తిగా మూడు సెషన్లు ఆడాలి. కనీసం రెండు సెషన్ల పాటైనా ఆడి 100కు పైగా ఆధిక్యత సాధిస్తే మ్యాచ్‌ను డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

స్కోర్ బోర్డు..

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 396/9 డిక్లేర్డ్

ఇండియా తొలి ఇన్నింగ్స్ : స్మృతి మంధాన (సి) కేథరిన్ బ్రంట్ (బి) నాట్ షివర్ 78, షెఫాలీ వర్మ (సి) అన్యా షర్బ్‌సోల్ (బి) కేట్ క్రాస్ 96, పూనమ్ రౌత్ (ఎల్బీడబ్ల్యూ)(బి) హీథర్ నైట్ 2, శిఖా పాండే (సి) అండ్ (బి) హీథర్ నైట్ 0, మిథాలీ రాజ్ (సి) టామీ బ్యూమౌంట్ (బి) సోఫీ ఎక్లిస్టోన్ 2, హర్మన్ ప్రీత్ కౌర్ (ఎల్బీడబ్ల్యూ)(బి) సోఫీ ఎక్లిస్టోన్ 4, దీప్తి శర్మ 29 నాటౌట్, తానియా భాటియా (ఎల్బీడబ్ల్యూ)(బి) సోఫీ ఎక్లిస్టోన్ 0, స్నేహ్ రాణా (సి) జోన్స్ (బి) సోఫీ ఎక్లిస్టోన్ 2, పూజా వస్త్రాకర్ (బి) కేథరిన్ బ్రంట్ 12, జులన్ గోస్వామి (బి) అన్యా షర్బ్‌సోల్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (81.2 ఓవర్లు) 231 ఆలౌట్

వికెట్ల పతనం : 1-167, 2-179, 3-179, 4-183, 5-183, 6-187, 7-187, 8-197, 9-230, 10-231

బౌలింగ్ : కేథరిన్ బ్రంట్ (11-2-42-1), అన్యా షర్బ్‌సోల్ (10.2-2-18-1), కేట్ క్రాస్ (12-4-40-1), నాట్ షివర్ (10-3-22-1), సోఫీ ఎక్లిస్టోన్ (26-5-88-4), హీథర్ నైట్ (11-8-7-2), సోఫియా డంక్లే (1-0-9-0)

ఇండియా రెండో ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) నాట్ షివర్ (బి) కేథరిన్ బ్రంట్ 8, షెఫాలి వర్మ 55 నాటౌట్, దీప్తి శర్మ 18 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (24.3 ఓవర్లు) 83/1

వికెట్ల పతనం : 1-29

బౌలింగ్ : కేథరిన్ బ్రంట్ (8-3-21-1), అన్యా షర్బ్‌సోల్ (6-1-25-0), సోఫీ ఎక్లిస్టోన్ (6-2-12-0), కేట్ క్రాస్ (4.3-0-24-0)


Next Story

Most Viewed