శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం

by  |
శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
X

దిశ, ఏపీ బ్యూరో : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 5,00,647 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 5,17,502 క్యూసెక్కులు ఉంది. కుడి, ఎడమ గట్ల విద్యుత్‌ కేంద్రంలో ఉత్పాదన కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 883.40 అడుగులు కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 206.9734 టీఎంసీలకి చేరింది. దీంతో అధికారులు శ్రీశైలం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి సాగర్‌కు నీరు విడుదల చేశారు. 10 గేట్లు ఎత్తివేయడంతో ప్రాజెక్టును తిలకించేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు.

ప్రాజెక్టు వద్ద సందర్శకుల తాకిడి

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో నిండుకుండను తలపిస్తోంది. మరోవైపు అధికారులు 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నీరు దిగువకు వదులుతున్న దృశ్యాలను చూసేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. పర్యాటకులు తమ సెల్‌ఫోన్లకు పని చెప్పారు. నిండుకుండను తలపిస్తున్న ప్రాజెక్టును ఫోటోలతో తమ సెల్‌ఫోన్‌లలో బంధించారు. అంతేకాదు గేట్ల వద్ద సెల్ఫీలతో పర్యాటకులు సందడి చేశారు. అసలే ఆదివారం కావడంతో జనం తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఘాట్ రోడ్డుపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి.

వరదముంపుపై కలెక్టర్‌ సమీక్ష

నాగర్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి భారీ మొత్తంలో నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహ ప్రాంతంలోని వరద నీటి ముంపు, లోతట్టు గ్రామాలలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులతో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వరదముంపుపై సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed