ఇంతకూ వాళ్లంతా ఎలా చనిపోయారు.. పొంతనలేని అధికారుల రిపోర్టులు

by  |
road accident deaths
X

దిశ, తెలంగాణ బ్యూరో : రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వ నివేదికలు విచిత్రంగా మారాయి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలన్నీ మద్యం మత్తులోనే జరుగుతున్నట్లు వెల్లడిస్తున్నాయి. అంతేకానీ రోడ్లపై గుంతలు, మరమ్మతులు, రోడ్​కటింగ్, స్పీడ్​బ్రేకర్ల కారణంగా ఒక్క ప్రమాదం కూడా సంభవించడం లేదని దాట వేస్తోంది. కానీ రోడ్డు ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన నివేదిక ప్రకారం మాత్రం మరమ్మతులు, క్రాసింగ్స్, గుంతలు, స్పీడ్​బ్రేకర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ యాక్సిడెంట్లలో చాలా మంది మృత్యువాత పడుతున్నట్లు వెల్లడించింది.

మా తప్పు లేదు

రోడ్డు ప్రమాదాలు, క్షతగాత్రులకు ఆర్థిక సాయం వంటి అంశాలపై ఇటీవల రాష్ట్ర రహదారుల విభాగం ఆర్టీఐకి ఇచ్చిన సమాధానాల్లో తప్పేమీ లేదని పేర్కొంది. ఒక విధంగా మద్యం మత్తులోనే ప్రమాదాలు జరుగుతున్నాయంటూ స్పష్టంగా తెలిపింది. అంతేకానీ జాతీయ రహదారులపై గుంతలు, కటింగ్స్, మరమ్మతులతో ఒక్క ప్రమాదం కూడా లేదని, వారికి నష్టపరిహారం చెల్లించలేదని ఆర్టీఐకి బదులిచ్చింది.

ఇదీ కేంద్రం నివేదిక

2019–2020 నివేదిక ప్రకారం రాష్ట్రంలో గతేడాది మొత్తం 6,603 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినట్లు ఎంఓఆర్‌టీ నివేదికల్లో పేర్కొంది. రోడ్డు కటింగ్స్, క్రాసింగ్స్, మరమ్మతులు, సరిగా రోడ్డు కనిపించకపోవడం వంటి కారణాలతో పాటుగా హెల్మెట్ లేకపోవడం, అతి వేగం, మద్యం మత్తు కారణాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 10,285 ప్రమాదాలు జరుగగా.. 4101 మంది మరణించారు. పట్టణ ప్రాంతాల్లో 11,945 ప్రమాదాల్లో 2502 మంది చనిపోయారు. మద్యం మత్తులో వాహనాలు నడుపడంతో 182 రోడ్డు ప్రమాదాలు సంభవించి 24 మంది మృత్యువాత పడ్డారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌తో 200 ప్రమాదాలు జరిగి 32 మంది, సిగ్నల్ జంప్ చేయడంతో 54 యాక్సిడెంట్లు జరుగగా 10 మంది మరణించారు. ఇక సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపే సమయంలో 17 ప్రమాదాలు చోటుచేసుకోగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు. మిగిలిన ప్రమాదాలన్నీ రోడ్ల పరిస్థితులు అధ్వానంగా ఉండటంతోనే జరిగినట్లు నివేదికల్లో పేర్కొంది.

రోడ్లపై గుంతలు, క్రాసింగ్స్, కటింగ్స్​వంటి కారణాలతో గతేడాది తెలంగాణలో 2516 యాక్సిండెంట్లు జరుగగా 813 మంది చనిపోయారు. రోడ్లపై ఎత్తువంపులతో వాహనాలు అదుపుతప్పి జరిగిన ప్రమాదాలు 506 జరుగగా 87 మంది మృత్యువాతపడ్డారు. ఇక రోడ్లపై తరుచూ మరమ్మతులు, కొత్తగా కన్​స్ట్రక్షన్ల కారణంగా ఏర్పడుతున్న గుంతల కారణంగా 558 ప్రమాదాలు జరుగగా 73 మంది చనిపోగా 738 మంది గాయాలపాలయ్యారు.

రాష్ట్రంలోని వంతెనలు, కల్వర్టుల దగ్గర ఎత్తువంపులు, ప్రమాదకరంగా ఉండటంతో 641 ప్రమాదాలు జరిగితే 163 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 396 మంది గాయాలపాలయ్యారు. రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా 146 ప్రమాదాలు జరిగితే 49 మంది మృత్యువాత పడ్డారు. రోడ్లపై మూలమలుపుల కారణంగా 1523 ప్రమాదాలు జరిగితే 514 మంది మృతి చెందారు. రోడ్లు సరిగా కనిపించకపోవడం, వంకర్లు, లైట్లు లేకపోవడం, చెట్లు అడ్డుగా ఉండటంతో 8655 ప్రమాదాలు జరిగాయి. వీటిలో ఏకంగా 3681 మంది చనిపోగా.. వేలాది మంది మృత్యువాత పడ్డారు.

Next Story

Most Viewed