అసంపూర్తిగా ముగిసిన కృష్ణా బోర్డు సమావేశం

by  |
అసంపూర్తిగా ముగిసిన కృష్ణా బోర్డు సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా జలాల వాటా తేలకుండానే కృష్ణా బోర్డు సమావేశం వాయిదా పడింది. హైదరాబాద్​లోని జలసౌధలో మంగళవారం కేఆర్​ఎంబీ మెంబర్​ సెక్రెటరీ డీఎం రాయపూర్​ ఆధ్వర్వంలో నిర్వహించిన సమావేశంలో రెండు రాష్ట్రాలు నీటి వినియోగంపై వాదనలకు దిగాయి. ఏపీ మళ్లీ పాత అంశంపైనే పట్టుబట్టింది. దీనికి తెలంగాణ కూడా ఘాటుగా స్పందించడంతో సమావేశం అసంపూర్తిగా ముగిసింది. వచ్చే వారం త్రీమెన్​ కమిటీ సమావేశం అవుతుందని నిర్ణయం తీసుకున్నారు. త్రిమెన్​ కమిటీలో భాగంగా తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు, బోర్డు ఛైర్మన్​ సమావేశం కానున్నారు.

కృష్ణా బేసిన్​ పరిధిలోని తెలుగు రాష్ట్రాల నీటి వినియోగం, అవసరాలు, కేటాయింపులపై కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన సమావేశంలో వరద సమయంలో వినియోగించిన జలాలను లెక్కల్లోకి తీసుకోవద్దంటూ ఏపీ మళ్లీ పేర్కొంది. అంతేకాకుండా కర్నూలు​ తాగునీటి సరఫరా కోసం కేసీ కెనాల్​ నుంచి జలాలను వాడుకున్నామని, తాగునీటి అవసరాల దృష్ట్యా కేసీ కెనాల్​ నుంచి డ్రా చేసిన నీటిని కూడా లెక్కల్లోకి తీసుకోవద్దంటూ ఏపీ ఇంకో కొత్త పేచీ పెట్టింది. దీనికి తెలంగాణ తరుపున అభ్యంతరం వ్యక్తం చేశారు. వరద జలాలను లెక్కించాల్సిందేనని వాదించారు.

కర్నూలు కేసీ కెనాల్​ ద్వారా తరలించిన నీటిని లెక్కల్లోకి తీసుకోకుండా హైదరాబాద్​కు తాగునీటి అవసరాల కోసం తీసుకున్న నీటిని కూడా లెక్కించవద్దంటూ తెలంగాణ సూచించింది. దీంతో ఏపీ సందిగ్థంలో పడింది. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి వివరణ తీసుకున్న తర్వాత చెప్తామని వివరించారు. ప్రస్తుతం పాత లెక్కలను పరిగణలోకి తీసుకోకుండా నీటి కేటాయింపులు చేయాలంటూ చెప్పడంతో పాత జలాలను లెక్కించాలని పేర్కొన్నారు. దీంతో రెండు రాష్ట్రాలు పట్టు మీదుండటంతో నీటి కేటాయింపులపై ఎటూ తేలలేదు. ఎలాంటి కేటాయింపులు, తీర్మానాలు లేకుండానే సమావేశాన్ని అసంపూర్తిగా ముగించారు.


Next Story

Most Viewed