కన్నీళ్లు పెట్టిస్తున్న కంకర రోడ్డు.. తండా ప్రజల బాధలు తీరేనా ?

by  |
కన్నీళ్లు పెట్టిస్తున్న కంకర రోడ్డు.. తండా ప్రజల బాధలు తీరేనా ?
X

దిశ, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం మండలాల్లో కొన్ని గ్రామాల నుండి మండల కేంద్రాలకు చేరుకోవాలంటే నేటికీ తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. ఏజెన్సీ గ్రామాల్లో రహదారుల అభివృద్ధికై ప్రభుత్వం మంజూరు చేసిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయి. మండలంలో ఏ మూల చూసినా రహదారులు గుంతలమయంతో మృత్యు ఘటికలు మోగిస్తూనే ఉన్నాయి. కొత్తగూడ మండలంలోని చెరువు ముందు తండా గ్రామ పంచాయితీ నుండి దొరవారివేంపల్లికి 7.6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ వైపున ఉన్న అనేక ఏజెన్సీ గ్రామాలు ఈ మార్గం గుండా కొత్తగూడ మండల కేంద్రానికి తక్కువ సమయంలో చేరుకునేలా వీలవుతుంది. దీనికి మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల బడ్జెట్‌ని కేటాయించారు. గత మూడు సంవత్సరాల క్రితమే నిధులు మంజూరయ్యాయి. అప్పట్లో మహబూబాబాద్ ఎంపీ అజ్మీర సీతారామ్ నాయక్ సైతం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి ప్రారంభించారు.

సదరు టెండర్ దక్కించుకున్న గుత్తదార్ పనులు చేపట్టారు. ఇకనైనా తమ కష్టాలు తీరతాయని ఆశించిన ఏజెన్సీ వాసులకు నిరాశే ఎదురైంది. కాంట్రాక్టర్ పని పూర్తి చేయకుండా కేవలం కంకర పోసి బీటు వేయడం మరిచారు. దీంతో కొత్తగూడకు షాట్ కట్‌గా ఈ మార్గాన్ని ఎంచుకునే ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. పూర్తిగా కంకర మీద ప్రయాణం చేయాల్సి రావడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మండలం చుట్టు లోతట్టు గ్రామాలు చాలా ఉన్నాయి. దొరవారి వేంపల్లి మొదలుకొని కామారం, మర్రిగూడ, పూనుగొండ్ల, దుబ్బగూడెం గ్రామాల ప్రజలు కొత్తగూడ రావడానికి తక్కువ దూరం, చాలా తక్కువ సమయం పడుతుండటంతో ఈ మార్గం ఎంచుకోక తప్పని పరిస్థితి. అలా కాకుండా చుట్టూ తిరిగి రావటానికి అదనంగా 30-40 కి.మీ ప్రయాణించాల్సి వస్తుంది. ఈ కారణంగా అత్యవసర సమయాల్లో ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. 7.5 కిలోమీటర్ల ప్రయాణం మధ్యలో వాహనం రిపేర్ వస్తే ఇక అంతే సంగతులు. కంకర కారణంగా వాహనాలు పంచర్ అయితే చుక్కలు చూడాల్సిన పరిస్థితి. ఈ దారి గుండా వెళ్లే వాహనాలు అదుపు తప్పి పడిపోయి ప్రమాదాలకు గురైన సంఘటనలు చాలా ఉన్నాయి. మార్గ మధ్యలో ఏ ప్రమాదం ఎదురైనా మళ్లీ మండల కేంద్రానికి తిరుగు పయనమవాల్సిన దుస్థితిని ఏజెన్సీ ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్నారు.

మట్టి రోడ్డు ఉన్నప్పుడే నయ్యం..

ఈ మార్గంలో గతంలో మట్టి రోడ్డు ఉండేదని, వివిధ గ్రామాల నుండి రాకపోకలు సాఫీగా సాగేవని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కంకర వేయడం మూలాన నడవటానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఇలాగే వదిలేస్తే ఇంకా అధ్వాన్నంగా మారుతుందనిఆరోపిస్తున్నారు. అలా జరిగితే ఈ మాత్రం ప్రయాణం కూడా చేయలేమని, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. గత మూడు సంవత్సరాల క్రితం మంజూరైన బీటీ రోడ్డు పనులు ప్రారంభించి కొన్ని రోజులకే నిలిపివేశాడు. ఏజెన్సీ ప్రాంత రహదారులు రిజర్వు ఫారెస్ట్‌లో ఉందనే కారణంగా అటవీ శాఖాధికారులు రోడ్డు పనులు నిలిపివేశారని గుత్తదారు చెబుతున్నారు. కాగా, అభివృద్ధికి జరుగుతున్న పనులను చట్టాల పేరుతో అడ్డుకుంటూ ఇబ్బందులు పెడితే అభివృద్ధి జరిగేదెలా అంటూ ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే పనులు పూర్తి చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

పీ.ఆర్.ఏ.ఈ యశ్వంత్..

బీటీ రోడ్డు పనులు ప్రారంభం నుండి కొన్ని రోజులు బాగానే జరిగాయి. ఎప్పటికప్పుడు పనుల్ని పర్యవేక్షించాము. కొంత మేరకు పనులు జరిగాక అటవీశాఖాధికారుల అభ్యంతరంతో మధ్యలోనే నిలిచాయి. రిజర్వ్ ఫారెస్ట్ కారణం వల్ల నిలిపివేశారు. త్వరలోనే క్లియరెన్స్ తీసుకొని పనులు పూర్తి చేయిస్తాము.

మా ఊరు చెరువు ముందు తండా గ్రామ పంచాయితీ నుండి గంగారం వెళ్లేందుకు ఒకే ఒక్క మార్గం ఇది. వేరే దారి లేదు కొత్తగూడ మండల కేంద్రం నుండి కామారం, మర్రిగూడ, మేడారం సమ్మక్క సారక్క, పగిడిద్దరాజు పూనుగొండ్ల జాతరకు వెళ్ళడానికి దగ్గరి మార్గం. గత మూడు సంవత్సరాల క్రితం రోడ్డు మరమ్మతులు ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. దీనివల్ల ప్రయాణీకులకు చాలా ఇబ్బందిగా ఉంది. కంకర పోయడంతో వచ్చి పోయే వాహనదారులు ప్రమదాలకు గురవుతున్నారు. తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి శాశ్వత పరిష్కారం కలింగించాలి.

జాటోత్ ఫుల్ సింగ్
చెరువు ముందు తండ సర్పంచ్



Next Story

Most Viewed