ఆ రోడ్డు బాగయ్యేనా.. ప్రయాణికుల బాధలు తీరేనా ?

by  |
ఆ రోడ్డు బాగయ్యేనా.. ప్రయాణికుల బాధలు తీరేనా ?
X

దిశ, గూడూరు : మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం నుండి నెక్కొండకు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. దీనివలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడు సంవత్సరాల క్రితం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వేసిన బిటి రోడ్డు గుంతల మయంగా మారి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వేరే కాంట్రాక్టర్ సంవత్సరం క్రితం ప్యాచ్ వర్క్‌లకు టెండర్ దక్కించుకుని కంకర వేసి డస్ట్ పోసి అలానే వదిలేశాడు. దీంతో ఆ రోడ్డుపై భారీ వాహనాలు వెళ్ళినప్పుడు వాటి వెనుక దుమ్ము లేస్తూ ఉండటం వలన వెనుక వెళ్తున్న వాహన చోదకులకు దుమ్ము కళ్ళలో పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గూడూరు నుండి నెక్కొండ‌కు ప్రధాన రహదారి ఇదే

గూడూరు మండల కేంద్రం నుండి అయోధ్యపురం, గాజుల గట్టు మీదుగా నెక్కొండ‌కు వెళ్లే ప్రధాన రహదారి ఇదే. రోజు వివిధ పనుల నిమిత్తం గూడూరు మండల కేంద్రానికి రావాలంటే ఈ రహదారి నుండి రావాల్సిందే, రోడ్డు గుంతల మయం కావడం‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

గూడూరు నుండి నెక్కొండ వెళ్లే రహదారి ఇరవై రోజుల్లో ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తామని ఆర్ అండ్ బీ ఏఈ తెలిపారు.

గూడూరు ఆర్ అండ్ బీ ఎఈ మౌజమ్ అలీ అన్సారీ

Next Story