ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఇలాకాలో అధికారుల నిర్లక్ష్యం.. వారిని పట్టించుకునేవారే లేరా ?

by  |
ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఇలాకాలో అధికారుల నిర్లక్ష్యం.. వారిని పట్టించుకునేవారే లేరా ?
X

దిశ, కాటారం: మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వగ్రామమైన కాటారం మండలం‌లోని ధన్వాడ గ్రామంలో ఎస్సీల సంక్షేమం కోసం మంజూరైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఎవరిపై వివక్షనో తెలియదుగానీ ఏళ్ల తరబడి ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి కాకపోవడం పట్ల ఆవర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బీసీలకు ఒక న్యాయం, ఎస్సీలకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. స్టేట్ డెవలప్మెంట్ పథకం కింద ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూపాయలు 2.50 లక్షలు, బీసీ కమ్యూనిటీ హాల్‌కు రూ 3.50 లక్షలు, గౌడ కమ్యూనిటీ హాల్‌కు రూ 3 లక్షలు మంజూరయ్యాయి.

బీసీ, గౌడ కమ్యూనిటీ హాల్‌లు పక్కపక్కనే నిర్మాణం చేశారు. ఈ నిధులు సరిపోకపోవడంతో మూడు కమ్యూనిటీ హాల్‌ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. వీటి నిర్మాణం పూర్తి చేసేందుకు 2018‌లో డీఎంఎఫ్‌టీ పథకంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ. 4లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి కావచ్చింది. ధన్వాడ గ్రామంలో 3 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం ఒకే ఏడాది నిధులు మంజూరు కాగా, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేసి, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడం పట్ల ఎస్సీ లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎస్సీ కమ్యూనిటీహాల్ కోసం మంజూరైన రూ 2.50 లక్షల నిధులతో పిల్లర్ల వరకు నిర్మాణం చేసి వదిలిపెట్టారు. ఏళ్లు గడుస్తున్నా కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయడానికి ఎలాంటి అదనపు నిధులు మంజూరు కాకపోవడంతో పిల్లర్ల స్థాయిలోనే కమ్యూనిటీ హాల్ వెక్కిరిస్తోంది. గ్రామంలోని 3,5 ఎస్సీ వార్డులలో మురుగు కాలువలు లేక నీరు నిలిచి ఉంటుండడంతో దోమలకు నిలయంగా మారిన ఎస్సీలు అనారోగ్యానికి గురవుతున్నారని, ఎస్సీల పట్ల ప్రభుత్వం వివక్ష కనబరు స్తోందని, మురుగు కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం లేదని కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయడంలో ఏళ్ల తరబడి నిర్లక్ష్యం కనబరుస్తున్నారని, ధన్వాడ గ్రామ వార్డు సభ్యులు బోడ శ్రీధర్, బోగే రాజేందర్, బోడ జ్యోతి‌లు ఆరోపించారు. ఇప్పటికైనా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed