గోదావరిఖనిలో మరో ఓపెన్ కాస్ట్.. రసాభాసగా అభిప్రాయ సేకరణ

by  |
singareni
X

దిశప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లో మరో అండర్ గ్రౌండ్ మైన్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుగా మారనుంది. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్న అధికారులు గురువారం గోదావరిఖని విటిసి సెంటర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు ఈ కార్యక్రమం రసాభాసగా మారింది. జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తంచేశారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అనుచరులతో పాటు శాప్ మాజీ ఛైర్మన్ మక్కన్ సింగ్ రాజ్‌ఠాకూర్‌లు పుట్ట మధు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సభావేదిక ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. వేదిక ముందున్న మక్కాన్ సింగ్‌తో పాటు మరికొంతమంది నేరుగా పోడియం వద్దకు వెళ్లారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత విషయాలను పుట్ట మధు మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. చివరకు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ చొరవ తీసుకోవడంతో ప్రజాభిప్రాయ సేకరణ యథావిధిగా సాగింది. గొడవ చోటు చేసుకోవడంతో మరింత మంది పోలీసులు అక్కడకు చేరుకుని బందోబస్తు నిర్వహిస్తున్నారు.

కాలుష్యంపై అవగాహన కల్పించండి : పుట్ట మధు

సంబంధిత గ్రామాల ప్రజలకు కాలుష్యంపై అవగాహన కల్పించాలని జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రజలకు వివరించడంలో బోర్డు విఫలం అయిందన్నారు. అధికారులు మరోసారి గ్రామాల్లోకి వెళ్లాలని అడిషనల్ కలెక్టర్‌ను కోరారు. గతంలో సింగరేణి నిర్వాసితులకు ఇళ్ల కోసం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని పుట్ట మధు ఆరోపించారు. ప్రజల అబిప్రాయాలు చెప్పేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌లకు తరలించిన చరిత్ర మర్చిపోవద్దన్నారు. గురువారం నాటి ప్రజాభిప్రాయ సేకరణలో తమ నిరసనను తెలిపేందుకు వచ్చిన గ్రామ ప్రజలను పోలీసులు చుట్టు ముడితే రామగుండం ఎమ్మెల్యే చందర్ వద్దని వారించారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. బాధిత గ్రామాల ప్రజల అభిప్రాయం వివరించేందుకు వచ్చినప్పుడు వారి బాధలు కూడా వినాల్సిన అవసరం ఉందనే చందర్ పోలీసులను వారించారని పుట్ట మధు తెలిపారు. ఇతర పార్టీల పాలనకు టీఆర్ఎస్ పాలనకు ఉన్న తేడా ఇదేనని ఆయన స్పష్టంచేశారు.

ప్రజల రక్షణ అవసరం: శ్రీధర్ బాబు

ఓసీపీ ప్రాజెక్టు నిర్మాణంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. బ్లాస్టింగ్‌లతో స్థానికులు నివసించే పరిస్థితి లేకుండా తయారవుతుందని, ఆ పరిస్థితి రాకుండా చూడాలని కోరారు.

నగరం చిన్నదిగా మారింది : సోమారపు సత్యనారాయణ

గోదావరిఖని నగరం చుట్టూ ఓపెన్ కాస్ట్‌లు ఏర్పాటు చేయడం వల్ల రాను రాను జనాభా తగ్గిపోతోందని బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఓసీపీల వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోందని అన్నారు. ఓసీపీల వల్ల రామగుండం పారిశ్రామిక ప్రాంతం విస్తరణకు నోచుకోకుండా పోతోందన్నారు. 5 ఇంక్లైన్‌ను ఓపెన్ కాస్ట్‌గా మార్చడం వల్ల బొగ్గు కోసం వెలికి తీసిన మట్టిగుట్టలు పెరిగిపోయాయని, దీంతో ఉష్ణోగ్రత కూడా పెరుగుతోందన్నారు.

Next Story