చేనేత ముసుగులో కార్పొరేట్ షాపింగ్ మాల్స్:నేషనల్ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేశ్

by  |
చేనేత ముసుగులో కార్పొరేట్ షాపింగ్ మాల్స్:నేషనల్ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేశ్
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: తక్కువ ధరలంటూ చేనేత ముసుగులో పవర్ లూమ్ వస్త్రాలను అమ్ముతున్న నకిలీల కార్పోరేట్ వస్త్రాలయాల దోపిడీ అరికట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ డిమాండ్ చేశారు. నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ కొలను నిర్మల అధ్యక్షతన హిమాయత్ నగర్ ఏర్పాటు చేసిన సమావేశంలో దాసు సురేశ్ ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడారు. పండగల వేళ భారీ ప్రమోషన్లతో కార్పొరేట్ షాపింగ్ మాల్ లు సినీ నటులతో విచ్చల విడిగా ప్రచారాన్ని నిర్వహిస్తూ వినియోగదారులను మోసగిస్తున్నారన్నారని ఆయన ఆరోపించారు. నేతన్నల కష్టార్జితాన్ని కార్పొరేట్ సంస్థలు కొల్లగొడుతున్నాయన్నారు. నకిలీ చేనేత వస్త్రాలు పక్క రాష్ట్రాల నుండి భారీగా దిగుమతి అవుతున్నాయని, ప్రతీ యేటా 50 వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందన్నారు. దీని వల్ల ఉపాధి కరువుతో పాటు రాష్ట్ర సంపదకు భారీ గండి పడుతుందన్నారు. సంపద సృష్టించేది కులవృత్తి దారులైతే దాని ఫలాలు అగ్రవర్ణాలు అనుభవిస్తున్నారన్నారని ఆయన మండిపడ్డారు. ఈ కారణంగానే ధరలు గిట్టుబాటు కాక చేనేత కార్మికులు వృత్తిని వదిలేస్తున్నారని, ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యల పాలవుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం పేదలు, ఉత్పత్తి సేవా కులాల పక్షాన ఉండాల్సింది పోయి వ్యాపారస్తులు, పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందన్నారు. తెలంగాణలో అంత్యంత ప్రాధాన్య స్థితిలో కార్పొరేట్ కుబేరులు ఉంటే, దిగజారి ఆత్మహత్యలు చేసుకుంటున్న స్థితిలో ఉత్పత్తి సేవా కులాల వాళ్ళు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్.వీ.రమణను కలిసి 1985 హ్యాండ్లూమ్ రిజర్వేషన్ ఆక్ట్ శిక్షలను కఠినతరం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. వస్త్ర దుకాణాల్లో నకిలీ వస్త్రాలు విక్రయిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు . వస్త్రాలయాల ప్రచార కార్యక్రమాల్లో నటించిన నటులపై చీటింగ్ కేసులు పెడతామని హెచ్చరించారు. వినియోగ దారులు మోసపూరిత ప్రకటనలకు మోసపోకుండా పోచంపల్లి , గద్వాల , చౌటుప్పల్ , సిద్ధిపేట లాంటి ప్రాంతాలకు స్వయంగా విచ్చేసి నాణ్యత కలిగిన చేనేత పట్టు వస్త్రాలను కొనుగోలు చేయాలని పిలునిచ్చారు . అవసరమైతే వినియోగదారుల ఫోరమ్ లేక మానవ హక్కుల కమీషన్ ను వెంటనే సంప్రదిస్తామని చెప్పారు.



Next Story

Most Viewed