డాక్టర్ సుధాకర్ ఘటనపై జగన్‌కు లేఖ రాసిన ఐఎంఏ

by  |
డాక్టర్ సుధాకర్ ఘటనపై జగన్‌కు లేఖ రాసిన ఐఎంఏ
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నంలోని ప్రభుత్వాసుపత్రిలో అనస్తీషియన్‌గా పని చేసే డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) స్పందించింది. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసింది. ఈ లేఖలో..

‘మే 16న ప్రభుత్వ డాక్టర్ సుధాకర్ రావుపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదు. వారి తీరుపై ఐఎంఏ తీవ్ర నిరసన తెలుపుతోన్నది. పరిస్థితులను అదుపు చేయడానికి సరైన పద్ధతులు ఉంటాయి. ఆసుపత్రిలో వైద్యుల రక్షణ విషయంపై ఆయన నిలదీసినందుకు ఇప్పటికే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. సీఎంపై ఆ వైద్యుడు అనుచిత వ్యాఖ్యలు సరికాదని మా అసోసియేషన్ స్పష్టం చేస్తోన్నది. మరోవైపు, ప్రభుత్వ వైద్యుడిపై పోలీసులు ఇలా ప్రవర్తించడం కలచివేస్తోన్నది. దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యులను బాధపెట్టింది. ఐఎంఏకు చెందిన ఓ నిజనిర్ధారణ క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎంకు ఈ లేఖ రాస్తున్నాం. సస్పెన్షన్‌ ప్రభావం సుధాకర్ మానసిక ఆరోగ్యంపై పడిందని ఆ ప్యానెల్ గుర్తించింది. దీని వల్ల ఆయన కుటుంబం ఆవేదన చెందుతోన్నది’ అని లేఖలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రాజన్ శర్మతో పాటు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

డాక్టర్ సుధాకర్‌పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. అలాగే, ఆయనను తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరింది. ఆయనపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, ఎన్ 95 మాస్కుల విషయంలో ప్రభుత్వాన్ని సుధాకర్ నిలదీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆవేశంతో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనిని ప్రాతిపదికగా తీసుకుని ఆయనను విధుల నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఆయనను అత్యంత అవమానకరంగా అరెస్టు చేసింది.

Next Story

Most Viewed