షమీకి ధోనీ మందలింపు..

by  |
షమీకి ధోనీ మందలింపు..
X

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియాకు విజయవంతమైన కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ ఒకరు. ఈ మాజీ కెప్టెన్ ఏడాది కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నా.. క్రికెట్ అభిమానుల నుంచి టీం ఇండియా సభ్యుల వరకు ఎవరో ఒకరు ధోనీని గుర్తుచేస్తూనే ఉంటారు. కరోనా నేపథ్యంలో ఇప్పుడు క్రికెటర్లంతా ఇంటికే పరిమితమైనా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంటున్నారు. తాజాగా బెంగాల్‌కు చెందిన మహ్మద్ షమీ, మనోజ్ తివారీలు సామాజిక మాధ్యమంలో లైవ్ చాట్ చేశారు. కాగా ఓ సందర్భంలో ఎంఎస్ ధోనీ తనపై ఏవిధంగా కోప్పడ్డాడో షమీ చెప్పుకొచ్చాడు. 2014లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు ధోనీనే కెప్టెన్. ఆ సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే అవుటైన మెక్‌కల్లమ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అయితే మెక్‌కల్లమ్ ఇన్నింగ్స్ మొదట్లోనే షమీ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ విడిచిపెట్టాడు. దాంతో విసిగిపోయిన షమీ.. ఆ తర్వాత ఇష్టానుసారం బౌలింగ్ చేశాడట. అదే ఇన్నింగ్స్‌లో టీం ఇండియా క్రికెటర్లు అనేక క్యాచ్‌లు జారవిడవడంతో కోపం తెచ్చుకున్న షమీ.. లంచ్‌కు ముందు ఓవర్ చివరి బంతిని బౌన్సర్‌గా వేశాడట. అది కీపర్, కెప్టెన్ ధోనీ చెవి పక్కనుంచి వెళ్లిందని అప్పటి విషయాన్ని షమీ తాజాగా గుర్తుచేసుకున్నాడు.

‘అందరూ లంచ్‌కు వెళ్లే సమయంలో.. ఎందుకు అలా బౌన్సర్ వేశావు’ అని ధోనీ అడిగాడు. భాయ్.. బంతి చేతిలో నుంచి జారిపోయిందని’ బదులిచ్చాను. అప్పుడు ధోనీ కోపంతో ‘చూడమ్మా.. నేను ఈ జట్టుకు కెప్టెన్‌ని.. నన్ను ఫూల్‌ను చేయకు.. నీలాంటి వాళ్లను ఎంతో మందిని చూశాను. ఎవరు ఏ స్థితిలో ఆట ఆడుతున్నారో పసిగట్టగలను’ అని మందలించాడని షమీ చెప్పాడు. ధోనీకి అన్ని విషయాలు తెలుస్తాయని.. కాని కోప్పడటం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటుందని చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed