ముంబైని తలపిస్తోన్న ఏజెన్సీ ప్రాంతం.. రెచ్చిపోతున్న బడాబాబులు

by  |
ముంబైని తలపిస్తోన్న ఏజెన్సీ ప్రాంతం.. రెచ్చిపోతున్న బడాబాబులు
X

దిశ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో గిరిజన చట్టాలకు, ప్రభుత్వ నియమ నిబంధనలకు బడా బాబులు తూట్లు పొడుస్తున్నారు. మండలంలో ఎక్కడ చూసినా బహుళ అంతస్తులు దగాదగా మెరుస్తున్నాయి. గిరిజన ప్రాంతంలో వన్ ప్లస్ టూ వరకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, ప్రభుత్వ నియమ నిబంధనలు తెలియజేస్తున్నాయి. కానీ, ప్రభుత్వ నియమాలను ధిక్కరించి, అమాయక గిరిజనులను బెదిరించి గిరిజన భూముల్లో అక్రమంగా మూడు, నాలుగు బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని గిరిజనులు, గిరిజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

గిరిజనుడు ఉండటానికి సెంటు భూమిలేదుగాని, అగ్రకులాల బడా బాబులు నాలుగు అంతస్తుల భవనాలను నిర్మించడానికి మాత్రం భూమి దొరుకుతుందా… అని ప్రజలు, గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. పినపాక మండలంలో ఎక్కడచూసిన అడ్డగోలుగా మూడు, నాలుగు బహుళ అంతస్తుల నిర్మాణలు చేపడుతున్నారని గిరిజనుల ద్వారా తేటతెల్లమవుతోంది. ఇంత జరుగుతున్న పినపాక మండల పంచాయతీ అధికారులు బడాబాబుల ఇచ్చే కాసులకు అమ్ముడుపోయారని బహుళ అంతస్తులు నిర్మాణ కట్టడాలు పంచాయతీ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు, పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు. ఇంత ఎత్తున బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా పంచాయతీ అధికారులు మౌనంగా ఉండటం ప్రశ్నర్థకంగా మారింది.

పంచాయతీ అధికారులు తీరు వల్ల రానున్న రోజుల్లో గిరిజనులు ఏజెన్సీలో కనపడరనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. గిరిజన చట్టాలను, గిరిజనులను కాపాడాల్సిన పంచాయతీ అధికారులే బడాబాబులు ఇచ్చే కాసులకు అమ్ముడుపోతే, గిరిజనులను కాపాడేది ఎవ్వరని పలురువు మేధావులు, పంచాయతీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమా…ముంబై ప్రాంతమా అని మండలంలో ఉన్న గిరిజనులు పలువురు మేధావులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పంచాయతీ అధికారులు బడబాబులు ఇచ్చే కాసులకు అమ్ముడుపోయారని మండలంలో నిర్మించే బహుళ అంతస్తులే దీనికి ఉదాహరణ అని మండల గిరిజనులు, హరిజనులు, పలువురు మేధావులు మాట్లాడుతున్నారు.

ఇంత అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు నిర్మిస్తున్న బడాబాబులపై చర్యలు శూన్యమని గిరిజనులు, గిరిజన సంఘాలు తెలుపుతున్నారు. బడాబాబుల అక్రమ కట్టడాలకు ముగింపు రావాలంటే జిల్లా కలెక్టర్ రంగంలోకి ప్రవేశిస్తేనే బహుళ అంతస్తులు నిర్మాణాలు అగుతాయని, ఏజెన్సీలో గిరిజనులకు మనుగడ కనిపిస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక జిల్లా కలెక్టర్ అక్రమ బహుళఅంతస్తులపై చర్యలు చేపట్టుతారా.. లేక బడాబాబులకు మద్దతు తెలుపుతారా అనేది వేచిచూడాల్సిందే. ఏది ఏమైనా జిల్లా కలెక్టర్ గిరిజనులను, గిరిజన చట్టాలను కాపాడి గిరిజనులకు మనుగడ కల్పిస్తారని మండలంలో ఉన్న గిరిజనులు, గిరిజనసంఘాలు, ప్రజా సంఘాలు ఎదురుచూస్తున్నారు. మరి పినపాక మండలంలో జరిగే బహుళ అంతస్థుల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ ఏమేరకు చర్యలు చేపట్టుతారో వేచిచూడాల్సిందే.



Next Story

Most Viewed