ఇసుక దందా..ఇస్‌కో పక్‌డో..

by  |
ఇసుక దందా..ఇస్‌కో పక్‌డో..
X

దిశ, రంగారెడ్డి: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్ గస్తీలో పోలీసులు, పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇష్టానుసారంగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. షాద్ నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక ఫిల్టర్‌లను ఏర్పాటు చేశారు. సారవంతమైన భూమిని వ్యాపారం కోసం తొవ్వేస్తున్నారు.

ట్రాక్టర్ ట్రిప్పు రూ.4,500..

జిల్లాలో పెద్దగా వాగులు, వంకలు లేకపోవడంతో ఫిల్టర్ సహాయంతో కృత్రిమ పద్ధతిలో ఇసుకను తయారు చేస్తున్నారు వ్యాపారులు. సాధారణంగా ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.3,000 ఉంటే ప్రస్తుతం రూ.4,500 వసూలు చేస్తున్నారు. లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ధరలపై వ్యాపారులను అడిగే నాథుడే లేడు. దీంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. వ్యవసాయ భూములనూ ఈ వ్యాపారులు ఛిన్నాభిన్నం చేసి ధ్వంసం చేస్తున్నారు. దీంతో భూగర్భజలాలు అడుగంటిపోయి తాగు, సాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతారని పలువురు అంటున్నారు. ఈ విషయాలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే, రెవెన్యూ, పోలీసు అధికారులకు పలు మార్లు పిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. మామూళ్ల మత్తుకు అధికారులు లొంగారనీ, వీరికి అధికార పార్టీ నేతల అండదండలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ దందా చేసే వ్యాపారులపై చర్యలకు ఇప్పటికైనా అధికారులు పూనుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags: sand transport, illegally, officers, revenue staff, merchants, people, action



Next Story

Most Viewed