మానసిక వికలాంగుడినీ వదల్లేదు..!

by  |
మానసిక వికలాంగుడినీ వదల్లేదు..!
X

దిశ, చండూరు : మానసిక వికలాంగుడు.. అని కనికరం లేకుండా ప్రాజెక్టు పేరుతో అక్రమ పట్టా చేయించారు పలువురు ప్రబుద్ధులు. 20 గుంటలు అవసరమని చెప్పి అదనంగా ఎకరం మీద మూడు గుంటలను రాయించుకున్నారు. ఈ ఘటన మర్రిగూడ మండలం సరంపేటలో వెలుగుచూసింది. ఇదే మండలంలో ప్రభుత్వం గతంలోనే శివన్నగూడ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా రైతుల భూమి అవసరం పడింది. ఈ నేపథ్యంలోనే సరంపేట గ్రామానికి చెందిన మానసిక వికలాంగుడు యాదయ్యకు ఎకరం 23 గుంటల భూమి ఉంది. ఇందులో 20 గుంటల మేర ప్రాజెక్టులో పోతుందని.. రాఘవ కన్స్‌ట్రక్షన్‌కు చెందిన ఒకరు యాదయ్యకు చెప్పారు. దీనికి అంగీకరించిన అతడు సంతకం చేశాడు.

కానీ, సదరు వ్యక్తులు 20 గుంటలకు బదులు.. యాదయ్య పేరు మీద ఉన్న మొత్తం భూమిని గతేడాదే అక్రమ పట్టా చేయించారు. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. దీంతో ఏమీ తెలియని యాదయ్య కాముగా ఉండగా.. పలువురు నిలదీయడంతో అప్పుడూ.. ఇప్పుడూ అంటూ సంవత్సరకాలంగా భూమిని తిరిగిస్తామని చెప్పుకొచ్చారు. అయినా, ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం సరంపేట క్రాస్‌రోడ్డు వద్ద యాదయ్యకు మద్దతుగా గ్రామస్తులు ధర్నా చేపట్టారు. శివన్నగూడ ప్రాజెక్టుకు తరలివెళ్తున్న టిప్పర్‌లను అడ్డుకున్నారు. బాధితుడికి న్యాయం చేసేవరకు ప్రాజెక్టు పనులు చేయొద్దని భైఠాయించారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఇది ఇలా ఉంటే మానసిక వికలాంగుడి ఆస్తిపై కూడా అక్రమ పట్టా చేయించుకోవడం ఏంటని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు.


Next Story

Most Viewed