దమ్ముంటే ఈసీతో మాట్లాడి ప్రకటన చేయండి

by  |
Chilagani Sampath Kumaraswamy
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ నేతలు ప్రకటనలు చేయడం బాధాకరమని, ఏండ్ల నుంచి ఉద్యోగుల సమస్యలు నెరవేర్చడం లేదని తెలంగాణ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ అధ్యక్షుడు చిలగాని సంపత్​ కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించడం సంతోషమే కానీ ఎప్పటి నుంచో రావాల్సిన పీఆర్సీ ఇవ్వకపోవడం విచారకరమన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 జూన్​ నుంచి పీఆర్సీ బకాయి ఉందని, గతంలో ఎన్నోసార్లు సీఎం, మంత్రులకు విజ్ఞప్తి చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పీఆర్సీ, ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి, ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావడంపై చాలా ప్రకటనలు చేశారన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్​ ఉద్యోగులకు వరాలిచ్చాడని, కానీ అమలు చేయడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్​ ఇస్తున్న హామీలు మంచివేకానీ దురదృష్టంతో కలగానే మిగిలిపోతున్నాయని ఎద్దేవా చేశారు.అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ముందు మరోసారి సీఎం కేసీఆర్​ను కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలు అంశాలపై సీఎం కేసీఆర్​ సానుకూలంగా ఉన్నారని ప్రకటనలు చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను నమ్మించేందుకు చూడటం బాధాకరమన్నారు. ఇలాంటి ప్రకటనలు చేయడంతో ఉద్యోగ సంఘాల నేతలకు ఏమైనా వారి స్వప్రయోజనాలు నెరవేరుతాయేమోనని, కానీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని సంపత్​ కుమారస్వామి మండిపడ్డారు.

సీఎం కేసీఆర్​ నిజంగాను అనుకుంటే… ఎన్నికల కమిషన్​ అనుమతి తీసుకుని న్యాయబద్ధంగా రావాల్సిన పీఆర్సీ, ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావడం, కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులకు సమానపనికి సమాన వేతనం, ఇవ్వాలని, ఇవన్నీ సాధించుకుంటేనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను నమ్ముతారన్నారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్​ అనుమతితో సీఎం ఇచ్చిన హామీలపై జీవో జారీ చేయాలని, అలాంటప్పుడే ప్రభుత్వ అడుగుజాడల్లో నడుస్తామని సంపత్​ కుమారస్వామి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ ప్రధాన కార్యదర్శి డా. పి. పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు నిర్మల తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed