బెడ్ ఉంటేనే బార్డర్ ఓపెన్.. పేషెంట్లకు నో ఎంట్రీ

by  |
బెడ్ ఉంటేనే బార్డర్ ఓపెన్.. పేషెంట్లకు నో ఎంట్రీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : వేరే రాష్ట్రాల నుంచి చికిత్సల కోసం వస్తున్న పేషెంట్లను ప్రభుత్వం అనుతించడం లేదు. చికిత్సలందించే ఆసుపత్రులు సంబంధింత పేషెంట్ల బెడ్‌ను కాన్ఫార్మ్ చేస్తేనే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. ఆసుపత్రులన్ని పేషెంట్లతో నిండిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేయడంతో పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్లకు ఊహించిన పరిస్ధితులు ఎదురవడంతో తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు.

మెడికల్ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో కరోనా చికిత్సలు పొందేందుకు ఇతర రాష్ట్ర పేషెంట్లు బారులు తీరుతున్నారు. గత రెండు నెలల నుంచి వేలాది మంది కరోనా పేషెంట్లు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరారు. స్వరాష్ట్రంలోని పేషెంట్లకు తోడుగా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరడంతో తీవ్రమైన బెడ్ల కొరత ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో నో బెడ్స్ బోర్డ్‌లు దర్శనమిస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉండే పేషెంట్లకు బెడ్లు దొరకక సరైన సమయంలో చికిత్సలందక చనిపోతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల పేషెంట్లను అనుమతించకుండా నిబంధనలు విధించింది.

సరిహద్దుల దగ్గరే బారికేడ్లు..

రాష్ట్ర సరిహద్దుల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి ఆంక్షలు మొదలయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి అంబులెన్స్‌లో చికిత్సల కోసం వస్తున్నవారికి తెలంగాణ పోలీసులు నిలిపివేసారు. ఆంధ్రప్రదేశ్ బార్డర్‌లో ఉన్న అలంపూర్, కోదాడ చెక్‌పోస్ట్‌ల దగ్గర కఠినమైన ఆంక్షలను విధించారు. బారీకెడ్లను ఏర్పాటు చేసి అంబులెన్స్‌లను అనుమతించడం లేదు. దీంతో పదుల సంఖ్యలో అంబులెన్స్‌లో నేషనల్ హైవేలపై నిలిచిపోయాయి. కరోనా కోసమే కాకుండా ఇతర చికిత్సల కోసం వచ్చిన వారిని కూడా రాష్ట్రంలోకి అనుమతించలేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నపేషెంట్లను తిరిగి సొంత ప్రదేశాలకు తీసుకువెళ్లారు.

ఆసుపత్రులు బెడ్ కన్ఫాం చేస్తే అనుమతి..

తెలంగాణ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో మందుస్తుగా బెడ్ రిజర్వ్‌ చేసుకున్న పేషెంట్లను మాత్రమే అనుమతిస్తున్నారు. బెడ్ల నిర్థారణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. చికిత్సల కోసం వస్తున్న పేషెంట్లు ఆసుపత్రి సిబ్బందిచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు పేషెంట్ వివరాలు అందించాల్సి ఉంటుంది. బెడ్‌ను రిజర్వు చేసుకున్నట్టుగా తగిన ఆధారాలను ఆసుపత్రి యాజమాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నింటిని పరిశీలించిన అనంతరం చెక్‌పోస్ట్‌‌లోని పోలీసులకు ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తరువాతే అంబులెన్స్‌లను రాష్ట్రంలోకి అనుమతించేలా నిబంధనలు విధించారు.

Next Story

Most Viewed