కరోనా ఖతం అయ్యేది అప్పుడే..

by  |
DH Srinivas
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాబోయే మూడు నెలల్లో థర్డ్ వేవ్ రూపంలో వైరస్​వ్యాప్తి చెందకుంటే, కరోనా ఖతమైనట్లేనని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు అభిప్రాయ పడ్డారు. 3 నెలల పాటు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. డిసెంబరు లోపు ఎలాంటి వేవ్‌లు రాకపోతే వైరస్​పై టెన్షన్​పడాల్సిన అవసరం లేదన్నారు. కోఠి ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కరోనా తీవ్రత తగ్గిందని చాలా మంది మాస్కు పెట్టుకోవడం లేదన్నారు. ఈ నిర్లక్ష్యం పనికిరాదని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో 80 శాతం మంది మాస్కు ధరించగా, ఆగస్టు, సెప్టెంబరులో 50 శాతానికి తగ్గిందన్నారు. ఇక ప్రస్తుతానికి కేవలం 20 శాతం మంది మాత్రమే మాస్కు ధరిస్తున్నట్టు తమ పరిశీలనలో తేలిందన్నారు. దీంతో పాటు భౌతికదూరం, శానిటేషన్​వంటి అంశాలను పూర్తిగా కనుమరుగు చేశారన్నారు. కానీ పూర్తిస్థాయిలో నియంత్రణ అయ్యే వరకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోనే కరోనా తీవ్రతను అడ్డుకున్నామన్నారు.

దేశ వ్యాప్తంగా ఏ రాష్ర్టంలో లేని విధంగా మన దగ్గర థర్డ్​వేవ్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగానే అన్ని జిల్లాల్లో పీడియాట్రిక్​వార్డులను ఏర్పాటు చేశామన్నారు. అంతేగాక విస్తృతంగా ఆక్సిజన్​బెడ్లను సిద్ధం చేశామన్నారు. అన్ని ఆసుపత్రుల్లో బాధితులకు వేగంగా వైద్యం అందిస్తున్నామని చెప్పారు. దీంతోనే రికవరీ రేట్​భారీగా నమోదవుతుందని స్పష్టం చేశారు.

ప్రయాణాలతో జాగ్రత్త…

గత కొన్ని రోజుల నుంచి పండుగలు, పార్టీలు విస్తృతంగా జరిగినా కేసులు సంఖ్య సాధారణంగానే కొనసాగుతుందని, ఇది మంచి పరిణామమని డీహెచ్ వివరించారు. అయితే పండగలు పేరిట ఇతర రాష్ర్టాల్లో రాకపోకలు సాగించే వారు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మహారాష్ర్ట, కేరళ, కర్ణాటక వంటి రాష్ర్టాల్లో కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉన్నదన్నదని, దీంతో అక్కడ నుంచి మన రాష్ర్టానికి వ్యాప్తి చెందేందుకు అవకాశం ఇవ్వొద్దన్నారు. అయితే ఇప్పటి వరకు కరోనా బారిన పడని వారు మరింత జాగ్రత్తలు పాటించక పోతే వైరస్​దాడిలో బలి అయ్యే చాన్స్​ ఉందన్నారు. ఇటీవల రాష్ర్టంలో 17 ఏళ్ల అమ్మాయి కరోనా బారిన పడి చనిపోయినట్టు వెల్లడించారు. పండుగలు, విందులు, షాపింగ్ చేసేటప్పుడు జాగ్రతలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వైరస్‌కు ఎక్స్​ఫోజ్​కాని వారు, టీకా పొందని వారు వెంటనే డోసులు తీసుకోవాలని కోరారు.

30 లక్షల డోసులు నిల్వ..

రాష్ర్ట వ్యాప్తంగా ఆరోగ్యశాఖ కోల్డ్​స్టోరేజ్‌లలో 30 లక్షల డోసులు నిల్వ ఉన్నాయని డీహెచ్​ పేర్కొన్నారు. వీటిలో నాలుగు రోజుల పాటు స్పెషల్​వ్యాక్సినేషన్​ నిర్వహించి సుమారు 25 లక్షల మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు కోట్ల లక్ష మందికి పైగా డోసులు ఇవ్వగా, వీరిలో 72 శాతం మంది మొదటి, 38 శాతం మంది రెండో డోసునూ పూర్తి చేసుకున్నారన్నారు. కానీ గడువు ముగిసినా ఇప్పటికీ 25 లక్షల మంది సెంకడ్ డోస్ తీసుకోలేదన్నారు. వీరిలో హైదరాబాద్​జిల్లా పరిధిలో 5 లక్షలు, మేడ్చల్‌లో 3 లక్షలు, రంగారెడ్డిలో మరో 3 లక్షల మంది అత్యధికంగా ఉన్నారన్నారు. రెండు డోసులు తీసుకుంటేనే సురక్షితమని ఆయన మరోసారి గుర్తుచేశారు.



Next Story