ఇస్తే పూల వర్షం…లేదా చావు డప్పు : ఎమ్మెల్యే ఈటల రాజేందర్

by  |
ఇస్తే పూల వర్షం…లేదా చావు డప్పు :  ఎమ్మెల్యే ఈటల రాజేందర్
X

దిశ,వనపర్తి : తెలంగాణ రాష్ట్రం మొత్తం దళిత బంధు అమలు చేయాలని, లేకుంటే ప్రగతి భవన్ ఎదుట చావు డప్పు మోగిస్తామని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామాపురం గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం కేవలం హుజురాబాద్ ఓటర్లను మభ్య పెట్టెందుకే ముందుకు తీసుకొచ్చారే తప్ప దళితులకు న్యాయం జరగలేదని ఆరోపించారు.

ప్రారంభించిన హుజూరాబాద్ లోనే నేటికీ దళిత బంధు అమలు కావడం లేదని అన్నారు. దళిత బంధు పై బడ్జెట్ ల కేటాయింపులు విధివిధానాలు ఖరారు చేసి,ఎప్పటి వరకు పూర్తి చేస్తారు అని ప్రజలకు తెలపాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ పై ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మే స్థితిలో లేరన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేసారు. అమలు చేస్తే పూలవర్షం కురిపిస్తారు అని, లేకుంటే ప్రగతి భవన్ ముందు చావు డప్పు కొడతారని అన్నారు. బీజేపీ కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేస్తే రాబోయే ఎన్నికలలో హుజురాబాద్ ఫలితాలు తెలంగాణలో మొత్తం పునరావృత్తం అవుతాయని అన్నారు.

రాచాల నివాసంలో తేనీటి విందుకు హాజరైన ఈటల..

కొత్త కోట మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ నివాసంలో హుజురాబాద్ ఎమ్మెల్యే రాజేందర్ తేనీటి విందులో పాల్గొన్నారు. ఈటలకి రాచాల యుగంధర్ గౌడ్ దంపతులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు శాలువా కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తరువాత తొలిసారి మా నివాసానికి రావటం చాలా సంతోషకరమని ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చిన ఈటల భవిష్యత్తులో సీఎం గా ఇక్కడికి రావాలని రాచాల ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ శిక్షణా తరగతులు జిల్లా అధ్యక్షులు ఎద్దుల రాజ వర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి బోస్ పల్లి ప్రతాప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, బి.కృష్ణ ,జిల్లా ప్రధాన కార్యదర్శులు మాధవ రెడ్డి, రామన్ గౌడ్ ఉపాధ్యక్షులు రామన్న ,వెంకటేశ్వర్ రెడ్డి, ఏ సీతారాములు, వేమారెడ్డి, ఇ.కుమారస్వామి, సుమిత్రమ్మ, నరాల నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ బుడ్డన్న, కార్యదర్శులు బొడ్డుపల్లి పరశురామ్, పద్మమ్మ, చిత్తారి ప్రభాకర్, వాణిజ్య సెల్ కన్వీనర్ బచ్చు రాము, అధికార ప్రతినిధి పెద్దిరాజు, సహదేవుడు, జిల్లా మోర్చా అధ్యక్షులు, మండల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శశికుమార్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భీమన్న నాయుడు,జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు గౌడ్,మదనాపూర్ మండల అధ్యక్షుడు మహీందర్ బాబన్న, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed