‘కరోనా ముందునాటి స్థాయికి చేరువలో వాటి ఉత్పత్తి’

by  |
‘కరోనా ముందునాటి  స్థాయికి చేరువలో వాటి ఉత్పత్తి’
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అన్‌లాక్ 4 దశ కొనసాగుతున్న క్రమంలో కార్లకు పెరిగిన డిమాండ్ కారణంగా భారత్‌లో హ్యూండాయ్ తన ఉత్పత్తి పరిమాణంలో కొవిడ్-19కి ముందునాటి స్థాయికి చేరుకునేందుకు దగ్గరగా ఉందని కంపెనీ వెల్లడించింది. మే నెల తర్వాత నెమ్మదిగా సడలిస్తున్న ఆంక్షల నేపథ్యంలో డిమాండ్ మెరుగ్గా ఉందని, జులై చివరి నుంచి చెన్నై ప్లాంట్‌లోని రెండు ఉత్పత్తి యూనిట్లలో పనులు జరుగుతున్నాయని హ్యూండాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీసెస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. కరోనాకు ముందు వరకు హ్యూండాయ్ ఇండియా రోజుకు 2500 కార్లను ఉత్పత్తి చేసింది. మొత్తం వార్షిక సామర్థ్యం 7.5 లక్షల కార్లు. లాక్‌డౌన్ తర్వాత మేలో రోజుకు 200 కార్లను తయారు చేసింది. క్రమంగా ఉత్పత్తిని పెంచుతూ..ఆగష్టు నాటికి ఉత్పత్తి సామర్థ్యం ఆగష్టు మొత్తానికి 43,535 యూనిట్లకు చేరుకుందని తరుణ్ గార్గ్ చెప్పారు.

అలాగే, ఏప్రిల్ నెలలో నమోదైన సున్నా అమ్మకాల తర్వాత మేలో 6,883 యూనిట్లు అమ్ముడవగా, జూన్‌లో 21,320, జులైలో 38,200 యూనిట్ల అమ్మకాలతో స్థిరమైన పెరుగుదల నమోదవుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఆగష్టులో దేశీయ అమ్మకాల్లో ఏడాది ప్రాతిపదికన 20 శాతం వృద్ధిని కంపెనీ సాధించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగష్టు మధ్య పలు మోడళ్లు వివిధ విభాగల్లో వృద్ధిని సాధించాయని తరుణ్ గార్గ్ తెలిపారు. రానున్న కొద్ది నెలల్లో అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా గడిచిన ఐదు నెలల కాలంలో హ్యూండాయ్ యుటిలిటీ వెహికల్ విభాగంలో క్రెటా, వెన్యూ మోడళ్లు టాప్ ప్లేస్‌ను దక్కించుకున్నాయి. మిడ్ సైజ్ సెడాన్ విభాగంలో వెర్నా మోడల్ టాప్ ప్లేస్‌కి చేరుకుంది. ఏప్రిల్-ఆగష్టు మధ్య ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో క్రెటా మొత్తం 33,726 యూనిట్లను విక్రయించగా, ఇతర కంపెనీ మోడళ్ల కంటే ఇది 20 శాతం అధికమని కంపెనీ పేర్కొంది. అలాగే, ఇదే కాలంలో సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో వెన్యూ మోడల్ కారు మొత్తం 20,372 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇదే విభాగంలో ఇతర మోడళ్లతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. ఎస్‌యూవీ విభాగంలోని క్రెటా, వెన్యూ మోడల్ కార్ల కొనుగోలుకు వినియోగదారుల నుంచి మంచి స్పందన ఉందని తరుణ్ గార్గ్ తెలిపారు.



Next Story