పట్నపొళ్లు బద్ధకస్తులని రుజువైందా !

by  |
పట్నపొళ్లు బద్ధకస్తులని రుజువైందా !
X

దిశ, తెలంగాణ బ్యూరో: పట్నపొళ్లు బద్దకస్తులని మరోసారి రుజువైంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే విస్తృత ప్రచారం చేస్తున్నా.. విద్యావంతులు, ధనవంతులు, బస్తీవాసులు ఓటేసేందుకు దూరమవుతూనే ఉన్నారు. మంగళవారం జరిగిన గ్రేటర్​ పోలింగ్​లో ఓటర్లు ముఖం చాటేశారు. పోలింగ్​ కేంద్రాల వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో గ్రేటర్​లో పోలింగ్​ శాతం గణనీయంగా తగ్గింది. మరోవైపు పలు అంశాల్లో వ్యతిరేకత ఓటర్లను పోలింగ్​కు దూరం చేసింది. అటు ప్రైవేట్​ ఉద్యోగులకు సెలవులు ఇవ్వలేదు. గ్రేటర్​ పరిధిలోని ప్రభుత్వ సంస్థలు సైతం నామమాత్రంగా సెలవులు ఇచ్చాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులు విధులకు రావాలంటూ హెచ్చరించాయి.

ఎందుకేయాలి..?
ఓటు వేయాలని వెళ్లిన నేతలకు పలుకాలనీల్లో ఎదురు సమాధానం వచ్చింది. ఇటీవల ప్రభుత్వం పంపిణీ చేసిన వరదసాయం వ్యతిరేకతకు మూలమైంది. ఉదయం నుంచి బస్తీలు, కాలనీల్లో ఓటేసేందుకు ప్రత్యేక వాహనాలతో వెళ్లిన రాజకీయపక్షాలపై తిరగబడినట్టే చేశారు. అసలు ఎందుకు ఓటేయాలంటూ నిలదీశారు. ప్రధానంగా అధికార పార్టీ నేతలకు ఈ వ్యతిరేకత ఎక్కువ తగలింది. అర్హులకు వరద సాయం రాకపోవడం, వచ్చినవారి నుంచి నేతలు సగం సగం తీసుకోవడంపై ప్రశ్నించే సమయం దొరికింది. చింతల్​‌బస్తీలో ఇదే అంశంపై టీఆర్​ఎస్​ నేతను బస్తీకి రాకుండా వెళ్లగొట్టారు. మీసేవ కేంద్రాల్లో అప్లై చేసుకున్నా రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రైవేట్​ ఉద్యోగుల దెబ్బ
ఈసారి ప్రైవేట్​ ఉద్యోగుల ఓట్లు పోల్​ కాలేదు. కరోనా కారణంగా ప్రైవేట్​ ఉద్యోగులను చాలా సంస్థలు తొలిగించాయి. దీంతో చాలా మంది గ్రామాలకు వెళ్లారు. ప్రధానంగా విద్యా సంస్థల్లో పని చేసేవారు పల్లెల్లోనే ఉన్నారు. స్థానికంగా కొన్నేండ్ల నుంచి ఇక్కడే ఉండటంతో వారికి గ్రేటర్​లోనే ఓటు హక్కు ఉంది. కానీ ఇప్పుడు వారంతా గ్రామాల్లోనే ఉండటంతో ఓటేయలేదు. దాదాపు ఆరున్నర లక్షల మంది ప్రైవేట్​ ఉద్యోగులు ఓటింగ్​కు దూరంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా సాఫ్ట్​వేర్​ ఇంజనీర్లు మరోసారి బద్దకస్తులుగా రుజువైంది. దాదాపు నాలుగున్నర లక్షల మంది సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు వర్క్​ ఫ్రంహోం చేస్తుండటంతో పోలింగ్​ శాతం తగ్గింది.

కీ బోర్డు వారియర్లేనా..?
ఇక వైట్‌ కాలర్‌ జాబులు చేసే వారు, టెకీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్‌ మూడు శాతం దాటకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జాబ్‌ హోల్డర్స్‌, టెకీల తీరును నెటిజనులు ట్రోల్‌ చేస్తున్నారు. ఓటు మన బాధ్యత అంటూ వాట్సాప్‌ స్టేటస్‌లు పెట్టడం కాదు.. వచ్చి ఓటు వేయడం ముఖ్యం అంటూ విరుచుకుపడుతున్నారు. పార్టీ అలా.. ఈ పార్టీ ఇలా అన్ని తిట్టడానికి ముందుంటారు మరి ఓటేయడానికి ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. అటు వరుస సెలవులు కూడా రావడంతో ఓటేసేందుకు ఇంట్రెస్ట్ చూపనట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రచారపర్వాన్ని ఉరకలెత్తించిన పార్టీలు పోలింగ్​ రోజు మాత్రం డీలా పడ్డాయి. కానీ ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి మాత్రం కరోనా కారణంగానే పోలింగ్ శాతం తగ్గిందని ప్రకటించారు.

గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు వస్తాయా…?
గత గ్రేటర్​ ఎన్నికల్లో మొత్తం 74,24,096 ఓట్లకు 33,62,688 (45.29 శాతం) ఓట్లు పోలయ్యాయి. అందులో నోటాకు పోలైన ఓట్లు పోగా అభ్యర్థులు, స్వతంత్రులకు కలిపి 33,49,379 ఓట్లు లభించాయి. పోలైన ఓట్లలో టీఆర్‌ఎస్‌ అత్యధికంగా 14,68,618 (43.85 శాతం) ఓట్లను దక్కించుకుంది. ఎంఐఎం 5,30,812 (15.85 శాతం) ఓట్లతో రెండో స్థానంలో ఉండగా… టీడీపీ 4,39,047 (13.11 శాతం), కాంగ్రెస్‌ 3,48,388 (10.40 శాతం), బీజేపీ 3,46,253(10.34 శాతం) ఓట్లను సాధించాయి. ఇటు సీపీఐ 12,748 ఓట్లు, సీపీఎం 8,538, బీఎస్పీ 10,478, లోక్‌సత్తా 10,385, ఇతర రిజిస్టర్డ్‌ పార్టీలు 28,765, స్వతంత్ర అభ్యర్థులు 1,46,481 ఓట్లను దక్కించుకున్నారు.


Next Story

Most Viewed