L&T సంచలన ప్రకటన.. అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..!

by  |
Hyderabad Metro
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రాపర్టీ ఫర్ సేల్ అని కనిపిస్తే చాలు.. రియల్టర్లు కొనేందుకు ఎగబడుతుంటారు.. అదే రీతిలో మెట్రోను విక్రయించేందుకు కూడా బోర్డులు పెట్టే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయంట… అవును ఎల్ అండ్ టీ కంపెనీ విడుదల చేసిన ఓ ప్రకటన ఇది నిజమనే చెబుతున్నాయి. మీలో ఎవరైనా కొనేందుకు సిద్ధంగా ఉన్నారా.. అయితే రెడీగా ఉండండి. కరోనా ధాటికి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలపాలయ్యాయి.. రైల్వే శాఖ గడిచిన రెండేళ్లలో వేల కోట్లు నష్టపోయినట్లు ఇదివరకే ప్రకటించింది. హైదరాబాద్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెట్రో కూడా కరోనా కాలంలో మూతపడటంతో కోట్లల్లో నష్టం వచ్చినట్లు ఎల్ అండ్ టీ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో నష్టాలను తగ్గించేందుకు హైదరాబాద్ మెట్రోలో వాటాలను అమ్మేందుకు కంపెనీ నిర్ణయించింది. అయితే హైదరాబాద్‌లో నడుస్తోన్న మెట్రోలో ఎల్ అండ్ టీకి 90 శాతం.. తెలంగాణ ప్రభుత్వానికి 10 శాతం వాటాలు ఉన్నట్లు మంగళవారం సంస్థ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (డెవల్‌పమెంట్‌ ప్రాజెక్ట్స్‌) డీకే సే ప్రకటించారు. దీనితో పాటు ఉత్తరాఖండ్‌లోని నాబా కోర్ ఆస్తులు, 1400 మెగావాట్ (MW) నాబా థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలపారు. ఎల్‌అండ్‌టీకి చెందిన 99 మెగావాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టును రెన్యూ పవర్‌ కంపెనీకి అమ్మేశామని తెలియజేసేలా ఓ ప్రకటన విడుదల చేశారు.. దీంట్లో హైదరాబాద్ మెట్రో విషయం కూడా చెప్పుకొచ్చారు.

అయితే ఇటు మెట్రోను అమ్మేందుకు సిద్ధమై మరోవైపు రుణాల కోసం సంస్థ ఎదురు చూస్తున్నట్టు వారి ప్రకటన ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,571 కోట్లు కాగా.. వివిధ కారణాలతో రూ.18,971 కోట్లకు పెరిగింది. ఇందులో అప్పుల ద్వారానే రూ.13,500 కోట్లు సేకరించారు. గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.383 కోట్లు నష్టాలు రాగా.. ఈ ఏడాది ఏకంగా రూ.1,766 కోట్ల లాస్ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ నష్టాలన్నీ తీర్చేందుకు కొన్ని షేర్ లను అమ్మేందుకు యోచిస్తున్నట్లు డీకే సంకేతాలివ్వడం గమనార్హం. అయితే మెట్రోని ఎక్కువగా వినియోగించేది ఐటీ ఉద్యోగులు, స్టూడెంట్స్ కావడంతో రెండేళ్లుగా మూతబడిన కాలేజీలు, ఆఫీసులతో ఈ నష్టాలు వచ్చాయని సంస్థ భావిస్తోంది.

ఉద్యోగుల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో భవిష్యత్తులోనూ ప్రయాణికుల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అప్పులు పెరిగిపోవడంతో తక్కువ ఇంట్రెస్ట్ తో రూ.5 వేల కోట్లు అప్పు ఇవ్వాలని గతంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మెట్రో కోరింది. కానీ, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఏం చేయలేని స్థితిలో మెట్రో ఉండిపోయింది. మరోవైపు రూ.4 వేల కోట్ల పెట్టుబడుల కోసం నేషనల్‌ ఇన్వె్‌స్టిమెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్) తో జరుపుతున్న చర్చలు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. పెట్టుబడుల కోసం ఇతర కంపెనీలతో జరిపిన చర్చలు కూడా ఫలించలేదు. దీంతో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో తన వాటాను అమ్ముకోవడమే మేలని ఎల్‌అండ్‌టీ భావిస్తోంది.



Next Story

Most Viewed