మెట్రో తిప్పలు.. స్టేషన్‌లో అడిగుపెడితే అవస్థలే!

by  |
మెట్రో తిప్పలు.. స్టేషన్‌లో అడిగుపెడితే అవస్థలే!
X

భాగ్యనగరవాసులకు సుఖమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెట్రో సర్వీసులను ప్రారంభించింది. ప్రారంభంలో ప్రతి రోజూ సుమారు నాలుగు లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణం చేసేవారు. కరోనా నేపథ్యంలో కొంత కాలం మూడబడిన మెట్రో మళ్లీ సర్వీసులను పునరుద్ధరించింది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే అపవాదును మూట్టగట్టుకుంటుంది మెట్రో సంస్థ. రద్దీ లేకపోవడంతో మెట్రో స్టేషన్లలో లిఫ్ట్​లు, ఎస్కలేటర్లను నిలిపివేసింది. దీంతో వయోవృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణ చార్జీలు తగ్గించకపోవడం, కనీస వసతులు కల్పించకపోవడంతో భాగ్యనగర ప్రయాణికులు మండిపడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మెట్రో స్టేషన్​లోకి ప్రవేశించినప్పటి నుంచి గమ్యం చేరిన తర్వాత మెట్రో స్టేషన్ బయటకు వెళ్లేంతవరకూ ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలి. మెట్రో సంస్థ నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మెట్రోలో టికెట్​గరిష్ఠ చార్జి రూ.60 వసూలు చేస్తుండగా స్టేషన్లలో ప్రజలకు సౌకర్యాలను కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. లాక్​డౌన్ తర్వాత మెట్రో స్టేషన్లు తెరుచుకున్నాయి. ప్రజలు మెట్రో ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఆయా స్టేషన్లలో ప్రయాణికుల కోసం లిఫ్టులు, ఎస్కూలేటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో మెట్రో స్టేషన్​కు సాధారణంగా నాలుగు ఆర్మ్​లు ఉంటుండగా రెండు వైపుల మాత్రమే లిఫ్టులు, ఎస్కూలేటర్లు ఉంటాయి. మామాలు రోజుల్లో వీటి వద్దకు వెళ్లడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది.

ప్రస్తుతం అవి కూడా పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్, ఉప్పల్, హబ్సిగూడ, సికింద్రాబాద్​ఈస్ట్​స్టేషన్లలో తరచూ లిఫ్ట్​లు పనిచేయడం లేదు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. మెట్రో స్టేషన్లలో ఆధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన లిఫ్ట్​లు, ఎస్కూలేటర్లు పనిచేయడం లేదు. అయితే టికెట్ చార్జీలను మాత్రం తగ్గించడం లేదు. మెట్రో ప్రయాణికులంతా మెట్ల మీద నుంచే రాకపోకలు కొనసాగించాల్సి వస్తోంది. వయోభారం, వికలాంగులు మెట్లు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు. టికెట్ చార్జీల్లో ఇతర సర్వీసులతో కలిపే ధరను నిర్ణయిస్తారు. మెట్రో చార్జీల్లో ఎలాంటి తగ్గింపు లేకపోయినా వసతులను మాత్రం తగ్గించడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తగ్గిన ప్రయాణికుల సంఖ్య..

గతంలో ప్రతీ రోజు సగటున నాలుగు లక్షల మంది ప్రజలు మెట్రో సర్వీసుల్లో ప్రయాణాలు చేస్తుండగా లాక్​డౌన్​ తర్వాత కేవలం లక్ష మంది మాత్రమే ప్రయాణిస్తున్నట్టు గణంకాలు చెబుతున్నాయి. ప్రతీ రోజు సర్వీసులను కూడా తగ్గించారు. ప్రయాణికుల రద్దీ లేకపోయినా లిఫ్ట్​లు, ఎస్కూలేటర్లు ఉపయోగించడంతో లాభం లేదని మెట్రో భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రయాణికులు తక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు లిఫ్ట్​లు సహా వీటి సేవలను యాజమాన్యం క్లోజ్​ చేసింది. మెట్రో స్టేషన్లలో లిఫ్ట్​లు, ఎస్కూలేటర్లు పనిచేయకపోవడంపై మెట్రో లిమిటెడ్​ అధికారులను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించారు.



Next Story

Most Viewed