వరద సాయంలో కార్పొరేటర్ల కక్కుర్తి !

by  |
వరద సాయంలో కార్పొరేటర్ల కక్కుర్తి !
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ వరద బాధితుల ఆర్థిక సాయంలో ‘క్యాష్’ చేసుకున్న కార్పొరేటర్లకు రాజకీయంగా ఉచ్చు బిగుస్తోంది. కార్పొరేటర్ల కక్కుర్తిపై పెద్దఎత్తున ఫిర్యాదులతో ఇంటెలిజెన్స్ ద్వారా వివరాలు తెప్పించుకొన్న మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. దీనికి తోడు పలువురు కార్పొరేటర్ల అనుచరులు ప్రజలను బెదిరించినట్లు తెలియడంతో ఇక వారికి చెక్‌ పెట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్ల పనితీరుపై గరంగరంగా ఉన్న మినిస్టర్.. విపత్కర పరిస్థితుల్లో కార్పొరేటర్ల వ్యవహరించిన తీరుపై గుస్సా అవుతున్నట్లు సమాచారం.

గత అక్టోబర్‌లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షం కురిసి హైదరాబాద్ నగరం అతలాకుతలం మైంది. వేలాది కుటుంబాలు వరద బారిన పడి తీవ్రంగా నష్టపోవడంతో వారికి తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. వరద బాధితులకు రూ.10వేలు, ఇల్లు పూర్తిగా కూలిపోతే రూ.లక్ష, పాక్షికంగా ధ్వంసం అయితే రూ.50వేలు ఇవ్వాలని నిర్ణయించి.. అందుకు నిధులు విడుదల చేసింది. ఇదేక్రమంలో సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా భావించిన కొందరు కార్పొరేటర్లు పేదల నోటి కాడి సాయాన్ని లాగేసుకున్నారు. ప్రభుత్వం ఒక్కో కార్పొరేటర్‌కు 4500 కుటుంబాలను టార్గెట్ పెట్టి నగదు పంపిణీ చేయాలని భావించింది. ఇక దొర్కిన కాడికి బర్కుడే అన్నట్లుగా వ్యవహించిన దాదాపు 32మంది కార్పొరేటర్లు జేబులు నింపుకున్నారు. 4500 కుటుంబాలు అన్న దగ్గర కేవలం వెయ్యి, 1500 కుటుంబాలకే డబ్బులు చేతులో పెట్టి మమ అనిపించారు. అందులో కొందరికి రూ.5వేలు, 3వేలు పంపిణీ చేయగా.. ప్రశ్నించిన కాలనీ వాసులను అనుచరులు బెదిరింపులకు గురి చేశారు.

అంతగాక కొంతమంది వరద బాధితుల దగ్గర ఆధార్ కార్డు తీసుకొని ఫోన్ నెంబర్లకు వచ్చిన ఓటీపీ ఆధారంగా డబ్బులు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల అసలు వరద బాధితులకు సాయం అందించకుండా పై ఫ్లోర్లలో ఉండే కుటుంబాలకు డబ్బులు అందించి, వీళ్లు కొంత సొమ్ము చేసుకున్నారు. ఈ విషయాలన్నీ జోనల్ కమిషనర్ల విచారణలో వెల్లడికాగా కొంతమందిపై స్థానిక నేతలే ఫిర్యాదు చేశారు. ఇలా 32మంది కార్పొరేటర్లు వరద పరిహారాన్ని దిగమింగి టికెట్లు పొగొట్టుకునే పరిస్థితులు తెచ్చుకోగా, అసలు వరద బాధితులను పట్టించుకోని మరోర 16మందికి ఇవే పరిస్థితులు కనపడుతున్నాయి.

ఇవ్వకుంటే తిరుగుబాటే !

వరద సాయంలో ఆరోపణలపై కేటీఆర్ సీరియస్ కావడంతో టికెట్లు దక్కవని కాన్ఫామ్ చేసుకున్న కార్పొరేటర్లు.. అదే స్థాయిలో నేతలను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చేఎన్నికల్లో భారీగా ఖర్చు చేయాల్సి ఉందని, అందుకే వరద సాయంలో వెనకేసుకున్నామని.. మళ్లీ ఎన్నికల కోసమే కదా అంటూ సమర్థించుకుంటున్నట్లు సమాచారం. సిట్టింగ్‌లుగా ఉండి ఓట్ల కోసం ఇప్పటికే లక్షలు ఖర్చు చేస్తున్నామని, మళ్లీ టికెట్లు ఇవ్వకుంటే ఎలా వదిలేసుకుంటామని, మీరు టికెట్ ఇవ్వకుంటే తిరుగుబాటుకే మొగ్గు చూపి మళ్లీ పోటీ చేస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఇప్పటికే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేస్తుండగా.. హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ముందు ముందు చూడాల్సిన అంశం.

Next Story