కాంగ్రెస్‎లో ‘కొండా’ గాలి వీచేనా.. హుజురాబాద్‌ పోరు తెగేనా..?

by  |
Konda Surekha, revanth reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‎లో హుజురాబాద్​ ఉప ఎన్నిక పోరు తెగడం లేదు. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసి, పోటాపోటీగా ప్రచారం చేస్తున్నా కాంగ్రెస్​మాత్రం ఎవరిని పోటీకి దింపాలనే నిర్ణయమే తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్‎లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్కం ఠాగూర్​కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. టీపీసీసీ కోర్​కమిటీ, ఎన్నికల కమిటీతో పాటు వర్కింగ్​ ప్రెసిడెంట్లు, పార్టీ సీనియర్​ఉపాధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇక్కడే హుజురాబాద్ అభ్యర్థి ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి.

కొండా రగడ

హుజురాబాద్​సెగ్మెంట్ నుంచి కొండా సురేఖ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి సూచనలతోనే ఈ పేరును ప్రతిపాదనల్లోకి తీసుకున్నారు. సురేఖను పోటీకి దింపితే బీసీ వర్గాల్లో కలిసి వస్తుందని, గెలుపు అవకాశాలు ఉంటాయని టీపీసీసీ సీనియర్​ నేతలు భావిస్తున్నారు. కానీ కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఉన్న దామోదర రాజనర్సింహా సుమారు పది పేజీల నివేదిక ఇచ్చారు. సురేఖ వద్దంటూ పలు అభ్యంతరాలు సూచించారు. స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. దీనిపై కొంత రాద్ధాంతం కూడా నెలకొంది. అయితే టీపీసీసీ నుంచి మాత్రం కొండా సురేఖ వైపు ఆసక్తి చూపిస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

అధిష్టానానికి అసంతృప్తుల ఫిర్యాదు

మరోవైపు హుజురాబాద్​అభ్యర్థి ఖరారు పార్టీలోని కొంతమంది అసంతృప్తులకు అవకాశంగా దక్కింది. దీనిపై పలువురు ఢిల్లీకి సమాచారమందించినట్లు తెలుస్తోంది. కొండా సురేఖను ఎందుకు పోటీకి దింపుతున్నారంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు పార్టీ శ్రేణులు చెప్పుతున్నాయి. కానీ కొండా సురేఖను పోటీకి దింపి సత్తా చాటాలని టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డితో పాటు పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్‌లో నేడు నిర్వహిస్తున్న సమావేశం ప్రాధాన్యతగా మారింది. మరికాసేపట్లో రాష్ట్రానికి రానున్న ఠాగూర్​.. నేరుగా కరీంనగర్‌కు వెళ్లి నేతలను చర్చించనున్నారు. అనంతరం సోమవారం కూడా గాంధీభవన్‌లో సీనియర్లతో సమావేశం నిర్వహించనున్నారు.



Next Story

Most Viewed