కారుణ్యంతో మానవతను చాటిన పోలీసులు

by  |
కారుణ్యంతో మానవతను చాటిన పోలీసులు
X

దండించే వారికి కరుణించే మనస్సు కూడా ఉంటుందని నిర్మల్ జిల్లా పోలీసులు నిరూపించారు. మానసిక పరిస్థితి బాగాలేక ఓ వ్యక్తి కొంతకాలంగా పిచ్చోడిలా మారాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని షేక్ సాహెబ్ పేటకు చెందిన షేక్ అలీ అనే వ్యక్తి మానసిక రోగంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు సైతం పట్టించుకోకపోవడంతో షేక్ అలీ రోడ్లపై తిరుగుతూ దారిలో వెళ్లే వారిని భయబ్రాంతులకు గురి చేసేవాడు. అలాగే నిర్మల్ పట్టణంలోని గుల్జార్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రార్థన స్థలంలోకి తరచూ వెళ్లి అక్కడికి వచ్చే వారికి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించేవాడు. దీంతో షేక్ అలీ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి సమస్యను ప్రార్థనా స్థలం సభ్యులు వివరించారు . అయితే ఆయన కుటుంబానికి ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు అందించే ఆర్థిక స్థోమత లేదని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నిర్మల్ పోలీసులు అండగా నిలిచారు. పట్టణ సీఐ జాన్ దివాకర్ మానసిక రోగి షేక్ అలీని చేరదీశారు. స్థానిక వైద్యులకు చూపించారు. అయితే ఆయనకు మానసిక స్థితి బాగా లేదని చెప్పడంతోపాటు హైదరాబాద్ స్థాయిలో వైద్యం అవసరమవుతుందని సూచించారు. సిఐ జాన్ దివాకర్ ఏఎస్ఐ ఫయాజ్‌లు ఇరువురు కలిసి షేక్ అలీని హైదరాబాదులోని ఎర్రగడ్డ మానసిక రోగుల ఆసుపత్రి లో చేర్పించారు. సుమారు 6నెలల పాటు అక్కడే చికిత్సలు అందేలా చూశారు. ఈ కాలంలో కూడా రోగికి అవసరమైన ఖర్చులను నిర్మల్ పోలీసులు భరించారు. దీంతో షేక్ ఆలీ పూర్తిగా కోలుకుని ఇప్పుడు సాధారణ జీవనం గడుపుతున్నాడు. తీవ్రమైన మానసిక రోగంతో బాధపడిన తనను ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాధారణ వ్యక్తిగా మార్చిన పట్టణ సీఐ జాన్ దివాకర్ ఏఎస్ఐ ఫయాజ్‌లకు షేక్ అలీ కృతజ్ఞతలు తెలిపాడు. ఎప్పుడు కాఠిన్యం ప్రదర్శిస్తారన్న ముద్ర ఉండే పొలీసుల్లోనూ కారుణ్యం ఉన్న వాళ్లు ఉంటారనడానికి ఈ సంఘటన అద్దం పడుతుంది.


Next Story

Most Viewed