తెలంగాణ సర్కార్‌కు షాక్ .. సీఎస్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు

by  |
తెలంగాణ సర్కార్‌కు షాక్ .. సీఎస్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సమస్య కారణంగా రైతులకు జరుగుతున్న నష్టం, నిర్వాసితులవుతున్న కుటుంబాలు, సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎనిమిది వారాల్లోగా వివరణలతో కూడిన నివేదికను సమర్పించాల్సిందిగా తెలంగాణ సీఎస్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. న్యాయవాది శ్రవణ్ గత నెల 30న దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం విచారించిన కమిషన్, బ్యాక్ వాటర్‌ సమస్య కారణంగా రైతులకు ఏ రూపంలో ఏ స్థాయిలో నష్టం జరుగుతున్నదో క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖకు కూడా నోటీసులు జారీ చేసింది. బ్యాక్ వాటర్ కారణంగా వేలాది మంది రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, పంట నష్టానికి కూడా పరిహారం అందడంలేదని, మంచిర్యాలకు చెందిన రాజేశ్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారని ఆ ఫిర్యాదులో శ్రవణ్ పేర్కొన్నారు.

బ్యాక్ వాటర్ కారణంగా సుమారు 80 వేల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోతున్నారని, సరైన అధ్యయనం చేయని కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో 30 వేల మంది రైతులు, కౌలు రైతులు నష్టపోతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాజెక్టు ముంపు ఇబ్బందుల వలన మూడు పంటలనూ రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. నిర్దిష్టమైన అధ్యయనం చేసి రైతులకు పునరావాసం కల్పించడంతో పాటు ఇప్పటివరకు జరిగిన నష్టానికి పరిహారాన్ని చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతంలో గవర్నర్‌కు సైతం పలువురు ఈ విషయాన్ని ఫిర్యాదు రూపంలో విన్నవించారని శ్రవణ్ గుర్తుచేశారు.

Next Story

Most Viewed