10 శాతం పెరిగిన హిందూస్తాన్ యూనిలీవర్ లాభాలు!

by  |
10 శాతం పెరిగిన హిందూస్తాన్ యూనిలీవర్ లాభాలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ దిగ్గజ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ. 2,061కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈసారి 9.6 శాతం పెరిగింది. అలాగే, సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 12.8 శాతం వృద్ధితో రూ. 11,915 కోట్లుగా వెల్లడించింది. అలాగే, ఈ త్రైమాసికంలో కంపెనీ దేశీయ వినియోగదారుల వృద్ధి సంవత్సరానికి 12 శాతంగా ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

‘సంస్థ అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరుని కనబరిచింది. ఈ త్రైమాసికంలో కంపెనీ పనితీరు, సామర్థ్యం, కార్యకలాపాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని, కంపెనీ పోర్ట్‌ఫోలియో పటిష్ఠంగా ఉందని, కరోనా సెకెండ్ వేవ్ ప్రతికూల ప్రభావాన్ని అధిగమించే చర్యలు తీసుకుంటున్నామని’ హెచ్‌యూఎల్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ మెహతా అన్నారు. జూన్ త్రైమాసికంలో సవాళ్లు ఎదురైనప్పటికీ ఆదాయంతో పాటు లాభాల పరంగా కూడా గణానీయమైన ఫలితాలను చూశాము. రాబోయే రెండేళ్ల కాలంలో సంస్థ ఉత్పత్తులకు డిమాండ్ మరింత పెరుగుతుందనే నమ్మకం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, గురువారం హెచ్‌యూఎల్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు 2.27 శాతం నష్టపోయి రూ. 2,378 వద్ద ట్రేడయింది.


Next Story

Most Viewed