గిఫ్ట్స్, ప్యాకేజెస్ పేరిట భారీ మోసం

by  |
గిఫ్ట్స్, ప్యాకేజెస్ పేరిట భారీ మోసం
X

నమస్తే అండి.. మీరీ మధ్యన షాపింగ్ చేశారా..? అక్కడ ఇచ్చిన లక్కీడ్రా కూపన్‌లో మీ మొబైల్ నెంబర్ నమోదు చేశారా..? మీ మొబైల్ నెంబర్ లక్కీడ్రాలో ఎంపికైంది. మీకు బహుమతులుగా సిల్వర్ కాయిన్, డిన్నర్ సెట్ వంటి వస్తువులు వచ్చాయి. కానీ బహుమతులు తీసుకునేందుకు భార్యభర్తలు ఇద్దరూ వచ్చి తీసుకోవాలి. మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే సింగిల్ గా వస్తే కుదురదు. జంటగా వస్తేనే గిప్ట్‌లు ఇస్తామంటూ ఫోన్ వస్తుంది. గిఫ్టులకు ఆశపడి అక్కడికి వెళ్లినా వారికి పగలే చుక్కలు చూపిస్తారు. నమ్మించి నట్టేట ముంచుతారు. వారి మోసాలకు బలైన బాధితుల సంఖ్య మహానగరంలో పెరుగుతుంది.

దిశ ప్రతినిధి, మేడ్చల్: అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రోజుకో మోసం వెలుగు చూస్తోంది. మొబైల్ నెంబర్లకు ఫోన్‌లు చేసి లక్కీడ్రాలో ఎంపికయ్యారని, గిఫ్ట్ వచ్చిందని కాల్ చేసి ఆశలు కల్పిస్తున్నారు. సిల్వర్ కాయిన్ డిన్నర్ సెట్ వంటి వస్తువులు వచ్చి తీసుకువెళ్లాలని బుట్టలోకి దించుతున్నారు. ఫలానా హోటల్‌కు నిర్దేశించిన సమయంలోనే రావాలంటారు. తప్పనిసరిగా భార్యభర్తలు కలిసి రావాలని కోరతారు. ఏదో గిప్ట్ వచ్చింది కదా.. అంటూ ఉత్సహంగా భార్యభర్తలు అక్కడికి వెళ్తే గిఫ్ట్ ఇవ్వకుండా వారి ఉత్పత్తుల గురించి వివరిస్తుంటారు. వారి వ్యాపారం, వారికున్న భూములు, వెంచర్లు, దేశ విదేశాల్లో ఉన్న హోటళ్లతో వారికున్న లింకుల గురించి చెబుతారు. ఎక్కడా ఏమి మాట్లాడనివ్వకుండా వారు చెప్పింది పూర్తిగా వినే వాతావరణం కల్పిస్తారు. సెలవుల్లో ఎక్కడెక్కడికి వెళ్తారంటూ ప్రశ్నిస్తారు. మధ్య తరగతి వారే అధికంగా అక్కడికి వస్తుంటారు. అలాంటి వారికి ముంబై, ఢిల్లీ, గోవా, కోల్ కతా, చెన్నయ్ లతోపాటు బ్యాంకాక్, యూకే, లండన్, సింగపూర్, మలేషియాలో కూడా హోటల్ బుకింగ్ లున్నాయని చెబుతారు. ఎప్పుడు వెళ్లినా వారం, రెండు వారాలు ఏమి చెల్లించకుండా అక్కడ బస చేయవచ్చని చెబుతారు. ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఇక్కడ ప్లాట్ ఉచితమని స్కీములు కూడా చెబుతారు.

ముగ్గులోకి దింపడం..

అంతస్థోమత లేదని.. తాము ఎప్పుడు అలాంటి ప్రదేశాలకు వెళ్లే అవకాశం లేదని చెప్పడానికి ఎంతగా ప్రయత్నించినా వినిపించుకోని ఏజెంట్లు వారిని పదే పదే గుచ్చి గుచ్చి వేధిస్తారు. మొహమాటంతో కొందరు భార్య ముందు చులకన కాలేక.. మరి కొందరు ఒకరు బుక్ చేయగానే హాళ్లో చప్పళ్లు మోగించి.. ఓ రకంగా మానసికంగా ఎంతో ఇబ్బంది కలిగిస్తారు. రూ.లక్షల్లో చెల్లించాల్సి ఉంటుందని, అయినా వాయిదాల పద్ధతి ఉంటుందని నమ్మించి అక్కడికక్కడే ఎంత వీలుంటే అంత దండుకుంటారు. ఒకవేళ అక్కడ డబ్బు లేదని చెప్పిన వినరు. అమాయకులను టార్గెట్ చేసి హాలీడే ప్యాకేజీలు, హోటళ్లు, రిసార్టులో ఉచిత వసతి సౌకర్యాలు కల్పిస్తామంటూ బుట్టలో వేస్తున్నారు. ఆ తర్వాత వారి నుంచి లక్షల రూపాయాలు వసూలు చేసి, దందా బంద్ చేస్తున్నారు. తీరా మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించినా దర్యాప్తు వేగంగా సాగదు. వారికి డబ్బు రాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా కొన్ని ఘటనలు..

-మెట్టుగూడకు చెందిన శ్రీకాంత్ కు ఓ గుర్తు తెలియని మహిళ నుంచి ఈ నెల 12న ఫోన్ వచ్చింది. ఇటీవల సికింద్రాబాద్ లో మీరు షాపింగ్ చేశారా..? అక్కడి గిప్ట్ కూపన్ లో మీరు రాసిన మొబైల్ నెంబర్ లక్కి డ్రాలో ఎంపికందంటూ నమ్మబలికింది. అయితే భార్యభర్తలు ఇద్దరు వస్తే.. మీకు ఉచితంగా బహుమతులు ఇస్తాం.. రేపు అనగా, 13న ఉదయం 11గంటలకు సెక్రటేరియేట్ పక్కనున్న అమృత కాస్టీల్ హోటల్ కు రావాలని చెప్పడంతో.. శ్రీకాంత్ తన భార్యతో కలిసి అక్కడి వెళ్లారు. రకరకాల స్కీములతో వారి బుర్రను వేడిక్కించారు.

– సుచిత్రకు చెందిన స్రవంతికి ఓ వ్యక్తి ఈ నెల 16న ఫోన్ చేసి, మీరు ఇటీవల సుచిత్ర సర్కిల్ లో షాపింగ్ చేశారా..? అని ప్రశ్నించాడు. లేదు అని ఆమె బదులివ్వడంతో.. లక్కిగా మీ నెంబర్ ను ఎవరు లక్కి కూపన్ లో రాశారో గాని మీ మొబైల్ నెంబర్ లక్కి డ్రాలో ఎంపికైందని చెప్పాడు. మీరు మీ భర్తను వెంట తీసుకోని సుచిత్ర సర్కిల్ లోని ఫలానా కార్యాలయానికి వస్తే ఉచితంగా బహుమతులు ఇస్తామనడంతో పాపం స్రవంతి తన భర్తను బతిమిలాడి అక్కడికి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్లింది. దీంతో వాళ్లకు హాలీ డే ట్రిపులంటూ లక్షన్నర చెల్లించాలని ఒత్తిడి తేవడంతో మాది మధ్యతరగతి కుటుంబమని, తాము అంత చెల్లించుకోలేమని వెనుదిరిగారు.

Next Story

Most Viewed