ఏపీలో పెన్షన్లలో భారీ కోత.. ఎందుకంటే!

by  |
ఏపీలో పెన్షన్లలో భారీ కోత.. ఎందుకంటే!
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం అర్హులైన వారికి సామాజిక పెన్షన్లు అందిస్తుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కళాకారులు, గీతకార్మికులకు ఇలా నెలనెల పెన్షన్లు అందిస్తోంది. అర్హులైన వారికి ప్రతి నెల 1న వలంటీర్ల నేరుగా వారి ఇంటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పెన్షన్ల లబ్ధిదారుల్లో కొందరు అనర్హులున్నారన్న సమాచారంతో ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. వితంతు, ఒంటరి మహిళల పింఛన్లపై విమర్శల నేపథ్యంలో తనిఖీ చేయగా అనేక మార్పులు ఉన్నట్లు గుర్తించింది. ఈ రెండు కేటగిరీల్లో పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారుల రేషన్, ఆధార్ కార్డులను పరిశీలించగా దాదాపు లక్షమందికి పైగా లబ్ధిదారుల వివరాల్లో మార్పులున్నట్లు గుర్తించారు.

వితంతు పెన్షన్ పొందుతున్నా బియ్యం కార్డులో భర్త పేరు ఉండటం, భర్త పేరు స్థానంలో కుమారుడి పేరు నమోదై ఉండటం, ఈకేవైసీలో లింగం తప్పుగా నమోదై ఉండటం, ఒంటరి మహిళలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు అందించకపోవడం, ఇంకొన్ని చోట్ల పెన్షన్ పొందుతున్న మహిళలు.. పురుషులుగా నమోదవ్వడం, ఆధార్‌ కార్డుల్లో మార్పులు వంటి కారణాలతో లబ్ధిదారులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. కర్నూలు-11,000, కృష్ణా-14,000, విజయనగరం-8,000, చిత్తూరు-16,000 మందికి నోటీసులు జారీ చేశారు.

వీరందరి కార్డులు పరిశీలించగా 6,000 మంది అనర్హులుగా సెర్ప్ అధికారులు తేల్చారు. వీరిలో చాలామంది ఒంటరి మహిళ కాకున్నా ఆ కేటగిరీలో పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. అనర్హులుగా నిర్ధారణ అయిన వారికి జూలై 1న పింఛన్ల పంపిణీ నిలిపేయనున్నట్లు సమాచారం. ఈనెల 30 వరకు తనిఖీ ప్రక్రియ జరుగుతుంది. అయితే నోటీసులు అందుకున్న వారు జూలై 15లోగా సంబంధిత ధృవపత్రాలు సమర్పించాలని అధికారులు ఆదేశించారు. పరిశీలనలో అర్హులుగా తేలితే వారికి ఆగస్టు 1న రెండు నెలలకు కలిపి పెన్షన్ చెల్లిస్తామని సెర్ప్ అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed