దేశీయంగా కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ ప్రారంభించిన హెచ్‌పీ కంపెనీ!

by  |
HP
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పర్సనల్ కంప్యూటర్, ప్రింటర్ దిగ్గజం హెచ్‌పీ భారత్‌లో స్థానిక తయారీ ప్రారంభించినట్టు బుధవారం ప్రకటించింది. పర్సనల్ కంప్యూటర్(పీసీ) పోర్ట్‌ఫోలియోను విస్తరించే ప్రణాళికలో భాగంగా, మేక్ ఇన్ ఇండియాకు మద్దతిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. చెన్నైలోని శ్రీపెరంబదూర్ ప్లాంట్‌లో ఈ తయారీని మొదలుపెట్టామని, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, మినీ డెస్క్‌టాప్‌లను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నట్టు కంపెనీ వివరించింది. ఇదే తయారీ ప్లాంట్‌లో కంపెనీ డిస్‌ప్లే మానిటర్లను కూడా తయారు చేస్తోందని, వీటిలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల వినియోగానికి వచ్చిన ఆర్డర్ల కోసం చేస్తున్నట్టు కంపెనీ అధికారిక ప్రకటనలో తెలుస్తోంది.

‘భారత్‌ను గ్లోబల్ తయారీ హబ్‌గా నిర్మించేందుకు తమ వంతు పాత్ర పోషించాలని కంపెనీ నిర్ణయించింది. భారత్‌లో వివిధ ఉత్పత్తుల తయారీలో కంపెనీ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నామని’ హెచ్‌పీ ఇండియా మార్కెటింగ్ ఎండీ కేతన్ పటేల్ అన్నారు. హెచ్‌పీ భారత్‌లో లక్షల ఉత్పత్తుల సరఫరాతో వరుసగా మూడో త్రైమాసికం మెరుగైన అమ్మకాలను సాధిస్తోందని ఆయన అన్నారు. ఇటీవల ఐడీసీ రూపొందించిన నివేదిక ప్రకారం.. పర్సనల్ కంప్యూటర్ మార్కెట్లో కంపెనీ 28.5 శాతం వాటాతో కమర్షియల్, కస్టమర్ల విభాగంలో పట్టును కొనసాగిస్తోంది.

Next Story

Most Viewed