ప్రధాన నగరాల్లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు..

by  |
business news
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 23 శాతం క్షీణించాయి. అయితే, గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 83 శాతం పెరుగుదల అని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ ఇండీయా తెలిపింది. ప్రస్తుత కేలండ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య నివాస గృహాల అమ్మకాలు 19,635 యూనిట్లుగా నమోదైనట్టు జేఎల్ఎల్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. జనవరి-మార్చి మధ్య కాలంలో ఈ అమ్మకాలు మొత్తం 25,583 యూనిట్లుగా నమోదు కాగా, గతేడాది ఏప్రిల్-జూన్ మధ్య 10,753 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రధాన నగరాల్లో బెంగళూరులో అమ్మకాలు 47 శాతం వృద్ధి సాధించగా, ముంబైలోనూ ఇళ్ల అమ్మకాలు పెరిగాయి.

హైదరాబాద్‌లో 3,709 యూనిట్ల నుంచి 3,157 యూనిట్లతో అమ్మకాలు 14 శాతం తగ్గాయి. చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 81 శాతం పడిపోగా, దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 55 శాతం క్షీణించాయి. కోల్‌కతా 56 శాతం, పూణెలో 6 శాతం ఇళ్ల విక్రయాలకు డిమాండ్ తగ్గింది. ‘తాజా గణాంకాలు స్థిరమైన డిమాండ్, కొనుగోళ్ల విశ్వాసాన్ని మార్కెట్లో కలిగిస్తున్నాయి. క్షీణత నమోదైనప్పటికీ ఇటీవల పరిస్థితులతో పోలిస్తే జూన్ త్రైమాసికంలో మెరుగైన వృద్ధి నమోదైంది. రీమోట్ వర్కింగ్‌ విధానం పెరుగుతున్న తరుణంలో పెద్ద ఇళ్లను కొనాలనుకునేవారు పెరిగారని’ జేఎల్ఎల్ ఇండియా నివేదిక అభిప్రాయపడింది.


Next Story